న్యూఢిల్లీ, జూలై 31: కరోనాకు వ్యాక్సిన్లు వచ్చేశాయి. మళ్లీ సాధారణ జీవితం ఎంతో దూరంలో లేదు అని భావిస్తున్న తరుణంలో అదే కరోనా మహమ్మారి డెల్టా వేరియంట్ రూపంలో ప్రపంచంపై విరుచుకుపడుతున్నది. వేగంగా వ్యాపించే గుణం, ఎక్కువ నష్టం కలిగించే విధంగా స్పైక్ ప్రొటీన్లో మార్పులు చేసుకొని కొత్త అస్ర్తాలతో మానవాళిపై దాడి చేస్తున్నది. టీకాలు అందిస్తున్న ఇమ్యూనిటీని దాటుకొని శరీరానికి నష్టం కలుగజేస్తున్నది. డెల్టా వేరియంట్ పెద్ద ప్రమాదకరమైనదేమీ కాదంటూ బహిరంగంగా తమ ప్రజలకు ధైర్యం చెప్పిన అమెరికా సీడీసీ అంతర్గత నివేదికల్లో మాత్రం వైరస్తో ముప్పు ఎక్కువేనని ఒప్పుకొన్నది. ఇప్పటి వరకు చూసిన అన్ని వైరస్ల కన్నా ఇది వేగంగా వ్యాపించగలదని పేర్కొన్నది.
132 డెల్టా వేరియంట్ వ్యాపించిన దేశాలు
చైనాలోనూ విజృంభణ..
కరోనాకు పుట్టినిల్లయిన చైనా సైతం డెల్టా వేరియంట్ను కట్టడి చేయడానికి తంటాలు పడుతున్నది. ఆ దేశంలో వారం రోజుల్లో 200 కేసులు నమోదయ్యాయి. డెల్టా దెబ్బకు ఇండోనేషియా కకావికలమైంది. అమెరికాలో రోజూ సగటున 70వేల కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు 80 శాతం కేసులు డెల్టా రకానికి చెందినవే. థాయ్ల్యాండ్లో 60 శాతానికిపైగా ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. జపాన్, ఆస్ట్రేలియా సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. డెల్టా ఉద్ధృతంగా వ్యాప్తి చెందడంపై డబ్ల్యూహెచ్వో అందోళన వ్యక్తం చేసింది. ‘మరిన్ని మహమ్మారులు పుట్టుకురాకముందే వైరస్ను అదుపు చేయాలన్న హెచ్చరిక ఇది’అని వ్యాఖ్యానించింది.
10 రాష్ర్టాల్లో మళ్లీ పెరుగుతున్న కేసులు
దేశంలో 10 రాష్ర్టాల్లో కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. పాజిటివిటీ రేటు 10 శాతం ఉన్న జిల్లాల్లో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ఆయా జిల్లాల్లో పరిస్థితి బాగా దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పది రాష్ర్టాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా టెస్టులను పెంచాలని సూచించారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
46 పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు
53 పాజిటివిటీ రేటు 5-10 శాతం మధ్య ఉన్న జిల్లాలు
సగం కేసులు కేరళ నుంచే..
దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో సగం కేరళ నుంచే ఉంటున్నాయి. దీనికి కారణం అక్కడ మెజారిటీ ప్రజల్లో యాంటిబాడీలు లేకపోవడమే. కేరళలో కేవలం 44 శాతం మందిలోనే కరోనా యాంటిబాడీలున్నుట్ట సెరో సర్వేల్లో వెల్లడైంది. ఇది దేశ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. అంటే ఇంకా 56 శాతం మందికి వైరస్ ముప్పు పొంచి ఉందన్నమాట. కేరళలో మళ్లీ కేసులు పెరగడానికి కారణం మూడో వేవ్ కాదని, యాంటిబాడీలు లేకపోవడమేని మరికొందరు వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఆగస్టు-సెప్టెంబర్లో థర్డ్వేవ్
గతేడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేసులు క్రమంగా పెరుగుతూ సెప్టెంబర్ నెలలో గరిష్టానికి చేరాయి. సెప్టెంబర్ 16న అత్యధికంగా 97,894 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ చివరికి తగ్గుముఖం పట్టాయి. రెండు నెలల విరామం అనంతరం మార్చిలో రెండో వేవ్ మొదలైంది. మే నెలలో గరిష్ఠానికి చేరింది. మే 6న రికార్డు స్థాయిలో 4,14,188 కేసులు నమోదయ్యాయి. జూన్ మధ్యలో మూడో వేవ్ కాస్త తగ్గింది. అంటే రెండు వేవ్ల మధ్య వ్యవధి రెండు నెలలు ఉంటున్నది. మళ్లీ రెండు నెలల విరామం తర్వాత కేసులు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ మధ్య కల్లా మూడో వేవ్ గరిష్ఠానికి చేరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడో వేవ్ ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో రావొచ్చని ఐసీఎంఆర్ అంచనావేసింది.