జకార్తా: కరోనా సోకిన ఒక వ్యక్తి భార్య వేషంలో విమానంలో ప్రయాణించాడు. ప్రయాణం మధ్యలో డ్రెస్ మార్చుకున్న అతడు ప్లైట్ సిబ్బంది కంటపడటంతో మారువేషం గుట్టురట్టయ్యింది. విమానం ల్యాండ్ కాగానే ఆ వ్యక్తికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ఇండోనేషియాలో ఈ ఘటన జరిగింది. డీడబ్ల్యూగా ముందు పేరు ఉన్న ఒక వ్యక్తి మహిళ మాదిరిగా బురఖా ధరించాడు. భార్య పాస్పోర్టు, ఆమెకు చెందిన కరోనా నెగిటివ్ రిపోర్ట్తో ఆదివారం జకార్తా ఎయిర్పోర్టుకు వచ్చాడు. అక్కడి సిబ్బంది కళ్లగప్పి టెర్నేట్కు వెళ్లే సిటీలిక్ డొమస్టిక్ విమానం ఎక్కాడు.
కాగా, ఆ ఫ్లైట్ టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత బురఖా ధరించిన ఆ వ్యక్తి బాత్రూమ్కు వెళ్లి మగవారి దుస్తులు ధరించి బయటకు వచ్చాడు. విమానంలోని మహిళా సిబ్బంది దీనిని గమనించింది. ఈ విషయాన్ని టెర్నేట్ ఎయిర్పోర్ట్ అధికారులకు చెప్పింది. దీంతో విమానం ల్యాండ్ కాగానే ఎయిర్పోర్టులోని వైద్య సిబ్బంది అతడికి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
టెర్నేట్ నగర కరోనా టాస్క్ఫోర్స్ సిబ్బందికి ఎయిర్పోర్ట్ అధికారులు ఈ విషయం చెప్పారు. దీంతో పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది నగరంలోని అతడి ఇంటికి అంబులెన్స్లో తరలించి ఐసొలేషన్లో ఉంచారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అతడ్ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు. కాగా, ఇండోనేషియాను డెల్టా వేరియంట్ వణికిస్తున్నది. ప్రతి రోజూ 50 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.