న్యూఢిల్లీ: కరోనా ( Covid-19 ) మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తోందో మనం చూస్తేనే ఉన్నాం. దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనుషుల సగటు ఆయుర్దాయం కొవిడ్ కారణంగా భారీగా తగ్గినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసిన తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికా ప్రజల సగటు ఆయుర్దాయం 2020లో రెండేళ్లు తగ్గినట్లు ఈ సర్వేలో తేలింది.
29 దేశాల్లో అధ్యయనం
ఈ అధ్యయనాన్ని 29 దేశాల్లో నిర్వహించారు. యూరప్తోపాటు అమెరికా, చిలీ దేశాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ 29 దేశాల్లో 22 దేశాల ప్రజల ఆయుర్దాయం 2019తో పోలిస్తే ఆరు నెలల మేర తగ్గినట్లు గుర్తించారు. ఈ దేశాల్లో అధికారిక కొవిడ్ మృతుల సంఖ్య కారణంగానే ఆయుర్దాయం తగ్గినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం అంచనా వేసింది. కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా మరణించారు. కరోనా వివిధ దేశాల్లో సృష్టించిన విధ్వంసానికి ఇది నిదర్శనమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రిద్ధీ కశ్యప్ అన్నారు.
పురుషుల్లోనే ఎక్కువ
అధ్యయనం నిర్వహించిన దేశాల్లో మహిళలతో పోలిస్తే.. పురుషుల ఆయుర్దాయమే ఎక్కువగా తగ్గినట్లు తేలింది. అమెరికా పురుషుల ఆయుర్దాయం 2.2 ఏళ్ల మేర తగ్గినట్లు గుర్తించారు. 15 దేశాల్లో పురుషుల ఆయుర్దాయం ఎక్కువగా తగ్గిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. 11 దేశాల్లో మాత్రం పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం తగ్గినట్లు గుర్తించారు. ఇక వయసు పరంగా చూసుకుంటే.. అమెరికాలో పని చేసే వయసు జనాభా అధికంగా ప్రభావితం కాగా.. యూరప్ దేశాల్లో 60 ఏళ్లకు పైబడిన వారి ఆయుర్దాయం తగ్గిందని అధ్యయనంలో తేలింది. కరోనా ప్రభావంపై మరింత స్పష్టమైన అధ్యయనం చేయడానికి ఇతర మధ్య, తక్కువ ఆదాయం గల దేశాలు తమ అధికారిక కరోనా మృతుల డేటా ఇవ్వాలని డాక్టర్ రిద్ధీ కశ్యప్ అన్నారు.