జెనీవా: యూరోప్ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. దాదాపు పది వారాల తర్వాత మళ్లీ కేసుల సంఖ్య పెరిగినట్లు ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నిజానికి ఇంకా అనేక యూరోప్ దేశాల్లో ట్రావెల్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. వైరస్ను నియంత్రించాలన్న ఉద్దేశంతో పలు దేశాలు ఆంక్షలను పాటిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకుని ఈయూ డిజిటల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్లు మాత్రమే యూరోప్ దేశాల్లో పర్యటించాలన్న నిబంధనను అమలులోకి తెచ్చారు.
యూరోప్ దేశాల్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ తాజాగా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. బ్రిటన్ నుంచి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ దేశాలకు వెళ్తున్న వారికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. క్వారెంటైన్ కూడా విధిస్తున్నారు. బ్రిటన్లో డెల్టా వేరియంట్ వల్ల లాక్డౌన్ ఆంక్షలను మరో నాలుగు వారాల పాటు పొడిగించారు.
మరోవైపు రష్యాలో కరోనా వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. వరుసగా మూడవ రోజు రికార్డు స్థాయిలో మరణాలు నమోదు అయినట్లు రష్యా ప్రభుత్వం వెల్లడించింది.