హైదరాబాద్ : కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యంగా గర్భిణుల ప్రసవానికి ముందు తర్వాత ఎంతో సంరక్షణ చర్యలు తీసుకోవడం కీలకం. ఎటువంటి ఏమరపాటు ప్రదర్శించినా గర్భిణుల శరీరంలో వైరస్ వ్యాప్తి పెరిగి వారు అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులకు దారితీయొచ్చు. ఇలా జరిగితే తల్లి, బిడ్డలకు ఇద్దరి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ఆస్కారం కూడా ఉంటుంది. అయితే సరిగ్గా ఇదే పరిస్థితిలో ఇటీవల కోవిడ్ పాజిటివ్తో ఆరోగ్యం క్షీణించి క్రమంగా కోలుకుంటున్న బాధితురాలికి ఎల్బీనగర్లోని అవేర్ గ్లెనిగల్స్ ఆస్పత్రి డాక్టర్లు విజయవంతంగా సిజేరియన్ చేసి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చేలా చేశారు.
కరీంనగర్కు చెందిన సౌజన్య(30) అనే గర్భిణిని ప్రసవం కోసం ఎల్బీనగర్ అవేర్గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవం గడువుకు ముందుగానే ఆస్పత్రి వైద్యులు గర్భిణికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. దానికి తోడు రక్తం పలచబడడం వంటి వివిధ రకాల సమస్యలు తలెత్తాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్ల బృందం ఎంతో అధునాతన మెరుగైన చికిత్సనందించారు. 39వ వారంలో సిజేరియన్ చేయగా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు, పుట్టిన బిడ్డకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని డాక్టర్లు తెలిపారు.