న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: రష్యా నుంచి స్పుత్నిక్ వీ టీకా తొలి బ్యాచ్ శనివారం భారత్కు చేరనున్న వేళ బ్రెజిల్ ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించింది. తమకు రష్యా పంపించిన స్పుత్నిక్ వీ టీకాల్లో జలుబును కలిగించే ఓ వైరస్ జీవించి ఉన్నట్టు తెలిపింది. అందుకే స్పుత్నిక్ వీ దిగుమతులపై నిషేధం విధించినట్టు ఆ దేశ ఆరోగ్య నియంత్రణ సంస్థ వెల్లడించింది. స్పుత్నిక్ వీని జలుబును కలిగించే ‘ఎడినో వైరస్’ సాయంతో తయారు చేశారు. టీకా తయారీలో భాగంగా ఈ వైరస్లో జన్యుమార్పులు చేసి, శరీరంలో పెరగకుండా చేశారు. అయితే ఇటీవల రష్యా పంపిన టీకాల్లో ఎడినో వైరస్ పునరుత్పత్తి జరుగుతున్నట్టు బ్రెజిల్ గుర్తించింది. ‘ఇది వ్యాక్సిన్ల ఉత్పత్తి విధానంపై విశ్వసనీయతను దెబ్బతీస్తున్నది’ అని ప్రముఖ వైరాలజిస్టు ఏంజెలా రాస్మ్యూసెన్ అన్నారు. అయితే టీకా ఉత్పత్తి చేసిన ‘గమాలయా’ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.