సింగపూర్/న్యూయార్క్, మే 17: దేశంలో కరోనా సెకండ్ వేవ్కి కారణమైన కొత్త వేరియెంట్ ప్రభావం పిల్లలపై కూడా ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహమ్మారిబారిన పడిన చిన్నారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటి దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. కొత్త రకం కేసులు తమ దగ్గర విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. భారత్లో వెలుగుచూసిన బీ.1.617 స్ట్రెయిన్ కేసులు సింగపూర్లో కూడా నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బుధవారం నుంచి దేశంలోని అన్ని పాఠశాలు, జూనియర్ కాలేజీలను విద్యాసంవత్సరం పూర్తయ్యే మే 28 వరకు మూసివేయాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ఆదివారం వర్చువల్గా నిర్వహించిన ఓ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ సమావేశానికి కొన్ని గంటల ముందు సింగపూర్లో 38 కేసులు నమోదయ్యాయి. గత ఎనిమిది నెలల్లో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులివే. ఇందులో చాలావరకు బీ.1.617 స్ట్రెయిన్కు సంబంధించిన కేసులే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఓ ట్యూషన్ సెంటర్లోని విద్యార్థి వల్ల ఇతర పిల్లలకు ఈ స్ట్రెయిన్ వ్యాపించినట్టు అనుమానించారు. దీంతో వెంటనే విద్యా సంస్థల్ని మూసివేయాలని నిర్ణయించారు. 16 ఏండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆ దేశ అధికారులు తెలిపారు.
కొత్త స్ట్రెయిన్ కేసులు విస్తరిస్తున్న క్రమంలో తైవాన్ రాజధాని తైపే, పొరుగున ఉన్న న్యూ తైపే సిటీలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి మే 28 వరకు నగరంలోని అన్ని స్కూళ్లను మూసివేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. సోమవారం ఒక్కరోజే 333 కొత్త కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
భారత్లో గతేడాది వెలుగుచూసిన బీ.1.617 వేరియెంట్ ఇప్పటికే 40కి పైగా దేశాల్లోకి వ్యాప్తి చెందిందని చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) డైరెక్టర్ జగత్ రామ్ తెలిపారు. ఇప్పటికే ఈ స్ట్రెయిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ‘వేరియెంట్ ఆఫ్ కన్సర్న్ (ఆందోళన కలిగించే రకం-వీవోసీ)’గా గుర్తించిందన్నారు. మిగతా స్ట్రెయిన్లతో పోలిస్తే ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, వ్యాక్సిన్ల ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) ఈ రకాన్ని ఎదుర్కోవడంలో కొంచెం తక్కువ సమర్థతను కలిగిఉండవచ్చని అభిప్రాయపడ్డారు.