మల్దకల్, మార్చి 30 : సింగిల్ విండో ద్వారా 20 ఏండ్ల కిందట తీసుకున్న రుణాలను రైతులు తీర్చాలని సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రం లో సింగిల్ విండో కార్యాలయంలో అధ్యక్షుడు తిమ్మారెడ్డి అధ్యక్షతన మంగళవారం రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇరవై ఏండ్ల కిందట బావులు తవ్వడం, కొత్త మోటార్లు తీసుకోవడం, పైపులైన్లకు గానూ 107మంది రైతులు రుణాలు తీసుకున్నారన్నారు. నేటికీ ఆ రుణాలను రైతులు తిరిగి చెల్లించకపోవడంతో ప్రస్తుతం ఆ రుణాలు రూ.2కోట్లకు చేరిందన్నారు. రుణాలు చెల్లించని వారిపై లీగల్గా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. వన్టైం సెటిల్ మెంట్ కింద రైతుకు 35శాతం రాయితీ రుణ మాఫీగా వర్తిస్తుందన్నారు. మళ్లీ వారికి కొత్తగా క్రాప్ లోన్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే 2020-21 ఏడాదికి గానూ 951మంది రైతులతో 36వేల క్వింటాళ్ల వరి , మొక్కజొన్న, పప్పుశనగ పంటలు కొనుగోలు చేశామని వీటికి గానూ రూ.7కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. దీంతో సొసైటీకి రూ. 9లక్షల కమీషన్ ఆదాయం వచ్చిందని వివరించారు. మళ్లీ కొత్తగా బావులు తవ్వడం, పైపులైన్లు, బోరు మోటార్లకు లోన్ కావాలంటే బకాయి రుణాల్లో 50శాతం వసూలు చేస్తేనే తప్ప కొత్తరుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అలాగే ప్రతి సంవత్సరం క్రాప్ లోన్లు మాత్రం రెగ్యులర్గా ఇస్తున్నామన్నారు. రూ.25వేల రుణమాఫీ కింద 64మంది రైతులు రూ.10.70లక్షల వరకు లబ్ధి పొందారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాకోబు, వైస్ చైర్మన్ విష్ణు, డైరెక్టర్లు వెంకటేశ్వర్రెడ్డి, శేషమ్మ, రమేశ్, పెద్దపాగుంటన్న, వార్డు సభ్యుడు నరేశ్, రైతులు మాజీ ఎంపీటీసీ వెంకటన్న, మధు, నరేందర్, ఉప సర్పంచ్ మల్దకల్, నాగరాజు, గోవింద్, తిమ్మప్ప, సిద్ధు, ఇతర గ్రామాలకు చెందిన డైరెక్టర్లు, సీఈవో కిరణ్కుమార్రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.