మహబూబ్ నగర్ : జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోని వాగులన్నిటిపై చెక్ డ్యామ్ లు నిర్మించడం ద్వారా నియోజక వర్గాన్ని పారే జీవనదిలా మారుస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన దేవరకద్ర నియోజకవర్గంలోని సీసీ కుంట, వడ్డేమాన్, లాల్కోట, పర్దీపూర్ లలో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించడంతో పాటు, పల్లమర్రిలో రూ.5.74 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్ కు శంకుస్థాపన చేశారు.
గోప్యానాయక్ తండా నుండి పర్దిపూర్ వరకు రూ.2.5 కోట్లతో నిర్మించే బి.టి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేవరకద్ర నియోజకవర్గంలోని ఊక చెట్టు వాగుపై ఇదివరకే 9 పెద్ద చెక్ డ్యామ్ లను చేపట్టామన్నారు. ఈ వాగుపై సుమారు 36 కిలోమీటర్ల మేర అవసరమైనన్ని చెక్ డ్యామ్ లు నిర్మించి ఎక్కడి నీటిని అక్కడే సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించి నియోజకవర్గం మొత్తన్ని పారే జీవనదిలా మారుస్తామని మంత్రి తెలిపారు. ఇటీవలే సీఎం కేసీఆర్ పేరూరు లిఫ్ట్ ను మంజూరు చేశారని, సాధ్యమైనంత త్వరగా పర్దిపూర్ లిఫ్ట్ ను కూడా చేపడతామని మంత్రి వెల్లడించారు.
రాబోయే రోజుల్లో వరి పంటను తగ్గించాల్సిన అవసరం ఉందని, వరికి బదులుగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని మంత్రి సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక పద్ధతులు, యంత్ర పరికరాలు వినియోగించడం ద్వారా వ్యవసాయాన్ని సాగు చేస్తే అత్యధిక లాభాలు సాధించవచ్చన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇచ్చిన మాట, చేసిన వాగ్ధానాన్ని మరువను
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే