హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులే నేరుగా ప్రవేశాలు పొందే అవకాశాన్ని ఇంటర్బోర్డు కల్పించింది. ఆన్లైన్ ద్వారా స్వయంగా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు, నచ్చిన కాలేజీలో చేరే అవకాశాన్నిచ్చింది. ఇప్పటివరకు దరఖాస్తులు స్వీకరించి, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించిన ఇంటర్బోర్డు ఈ ఏడాది నుంచి విద్యార్థులే నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం, వీటి ఆధారంగా ప్రవేశాలు పొందేందుకు వీలుగా ఇంటర్బోర్డు వెబ్సైట్లో సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ను ఇచ్చింది. మంగళవారం నుంచి www.tsbie.cgg.gov.inలో ఈ సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. ఇంటర్ మొదటి విడుత ప్రవేశాలు మే 25 నుంచి ప్రారంభం కాగా, జూలై 5 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఇది వరకు ప్రిన్సిపాల్ లాగిన్ ఐడీ ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ ప్రవేశాలు కల్పించగా, ఈ ఏడాది నుంచి విద్యార్థులే ఆన్లైన్ ద్వారా నేరుగా ప్రవేశాలు పొందే అవకాశాన్నిచ్చారు. దీంతో ప్రవేశాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరంలేదని జలీల్ స్పష్టంచేశారు. సెల్ఫ్ ఎన్రోల్మెంట్ పేజీలో ఎస్సెస్సీ హాల్టికెట్ నంబర్ను ఎంటర్చేసి, తాము చేరదల్చుకున్న ప్రభుత్వ కాలేజీ పేరు ఎంపికచేసుకొని ప్రవేశాలు పొందవచ్చని వివరించారు.
ఆన్లైన్ క్లాసులు వాయిదా
కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో కాలేజీల రీ ఓపెన్ను ఇంటర్బోర్డు వాయిదావేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2021- 22 విద్యాసంవత్సరానికి ఆన్లైన్ క్లాసులు మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆన్లైన్ తరగతుల నిర్వహణను వాయిదావేస్తున్నట్టు సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఆన్లైన్ ప్రవేశాలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ప్రిన్సిపాళ్లు తమ కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బందిని వినియోగించి ప్రవేశాలను కొసాగించవచ్చని వెల్లడించారు.