న్యూఢిల్లీ: తన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ పేరును సిఫారసు చేశారు ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే. ఆయన పదవీ కాలం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. దీంతో తన వారసుడి పేరును సిఫారసు చేయాల్సిందిగా ప్రభుత్వం బోబ్డేను కోరింది. గత శుక్రవారమే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు బోబ్డేకు లేఖ రాశారు. బోబ్డే తర్వాత ఎన్వీ రమణనే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. 1957, ఆగస్ట్ 27న జన్మించిన రమణ పదవీ కాలం 2022, ఆగస్ట్ 26తో ముగుస్తుంది. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్కే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి దక్కాల్సి ఉంటుంది. 2017, ఫిబ్రవరి 14 నుంచి రమణ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. అంతకుముందు ఆరు నెలల పాటు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పని చేశారు. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబర్ 1 వరకు ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పని చేశారు. కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు.
అవినీతి ఆరోపణలు
గతేడాది అక్టోబర్లో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి.. ఎన్వీ రమణపై అవినీతి ఆరోపణలు చేస్తూ సీజేఐకి లేఖ రాశారు. అమరావతిలో ఆయనతోపాటు ఆయన బంధువులు భూ సేకరణ విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు జగన్ ఆరోపించారు. అంతేకాకుండా ఏపీ హైకోర్టులో జరుగుతున్న విచారణలను ప్రభావితం చేసి తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కూడా చేస్తున్నట్లు జగన్ ఆ లేఖలో చెప్పారు. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు.