94.3% కచ్చితత్వంతో ఫలితం
లండన్, మే 24: ప్రత్యేక శిక్షణనిచ్చిన శునకాలు కరోనా రోగులను అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలవని మరో అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో శునకాలు 94.3 శాతం కచ్చితత్వంలో కరోనా రోగులను గుర్తించగలవని తేలింది. కరోనా సోకి లక్షణాలు కనిపించనివారినీ శునకాలు గుర్తించడం విశేషం. పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా 3,758 మంది నమూనాలను (కరోనా సోకినవారి టీషర్టులు, సోకనివారి టీ షర్టులు) శునకాల ముందు పెట్టి పరీక్షించారు. ఇదిలా ఉండగా, శిక్షణనిచ్చిన శునకాలను నౌకాశ్రయం, విమానాశ్రయాల్లో విధుల్లో పెట్టి కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్నదానిపై శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు. ఓ గణిత పద్ధతి ప్రకారం ఒక శునకం 30 నిమిషాల్లో 300 మందిని పరీక్షించగలదని తేలింది.