నీల్వాయి ప్రాజెక్టు ద్వారా నీటి సౌలతు n పెరిగిన భూగర్భ జలాలు
తాగు, సాగు నీటికి తప్పిన తిప్పలు n కండ్ల ముందు మిషన్ కాకతీయ ఫలాలు
యేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం n ఆనందంలో రైతులు
మంచిర్యాల, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : మంచిర్యాల జిల్లాలో జలసవ్వడులు వినిపిస్తున్నాయి. మండు వేసవిలోనూ ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దశాబ్దాలుగా నెర్రలుబారిన నేలలు బంగారు రంగు పులుముకున్నాయి. చెరువులు మిషన్ కాకతీయతో రూపుమారాయి. అపర భగీరథుడి చొరవతో బావుల్లో నీరు చేతికందుతున్నది. బోర్ల నుంచి నీరు ఉబికి వస్తున్నది. ఫలితంగా సాగు విస్తీర్ణం పెరుగగా.. రైతాంగం మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. మంచిర్యాల జిల్లాలో 890 చెరువులు నిండుగా ఉండగా.. 63496 ఎకరాల ఆయకట్టు ఉంది.
మంచిర్యాల జిల్లా పరిధిలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పరిధిలో 123 చిన్ననీటి వనరులు, 767 పీఆర్ కుంటలు కలుపుకొని మొత్తం 890 ఉన్నాయి. వీటి కింద 63,496 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మిషన్ కాకతీయ పేరిట పూడిక తీసింది. మరమ్మతులు చేసింది. గతంలో దయనీయంగా ఉన్న చెరువులు, కుంటలు సీఎం కేసీఆర్ చొరవతో జలకళ సంతరించుకున్నాయి. ఏ ఊరికి వెళ్లినా నిండుకుండల్లా ఉన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. చేద వేస్తే అందని నీరు చేతికందుకుతున్నాయి. చేతి పంపుల్లోనూ పుష్కలంగా నీరుండడంతో గ్రామాల్లో తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా ఉంది. దీంతో తాగు నీటికి తప్పిందని అటు ప్రజలు, సాగు నీటి సమస్య లేక అన్నదాతలు ఆనందంలో ఉన్నారు. కండ్లముందు నీళ్లు కనబడుతుంటే సంబురాలు చేసుకుంటున్నారు.
మిషన్ కాకతీయ కింద పునరుద్ధరణ
మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించింది. మొదటి విడుతలో భాగంగా 147 చెరువుల మరమ్మతు కోసం రూ.37.21 కోట్లు ప్రభుత్వం ద్వారా పరిపాలన ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,542 ఎకరాలకు లబ్ధి చేకూరుతున్నది. ఇప్పటి వరకు 147 పనులు పూర్తి కాగా.. రూ.23.86 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడుతలో 158 చెరువుల మరమ్మతు లక్ష్యం కాగా, 152 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు ప్రగతిలో ఉన్నాయి. వీటి ద్వారా 15,253 ఎకరాలకు లబ్ధి కలుగుతున్నది. మూడో విడుతలో 106 పనులకు 87 పూర్తయ్యాయి. మిగితావి పురోగతిలో ఉన్నాయి. వీటి ద్వారా 9,908 ఎకరాలకు లాభం జరుగుతున్నది. నాలుగో విడుతల కింద 60 పనులకు 39 పూర్తయ్యాయి. ఒక పని రద్దు చేయాల్సి ఉండగా, మిగితావి ప్రగతిలో ఉన్నాయి. వీటి ద్వారా 7,353 ఎకరాలకు లబ్ధి చేకూరుతున్నది.
భూగర్భ జలాల్లో మార్పు..
భూగర్భ జల మట్టాలలో హెచ్చుతగ్గులు, నీటి నాణ్యత తెలుసుకునేందుకు జిల్లాలో 15 సాధారణ పరిశీలక బావులు ఉన్నాయి. తొమ్మిది కమాండ్ ఏరియా పరిశీలక బావులు, 18 ఫీజియోమీటర్ బావులను ఏర్పాటు చేసి జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 2019 నవంబర్లో జిల్లా సరాసరి నీటిమట్టం 3.63 మీటర్లు ఉండగా, 2020 నవంబర్లో 3.90 మీటర్లు ఉంది. గతేడాదితో పోలిస్తే నీటి మట్టం 0.27 మీటర్లు తేడా ఉంది. 2019 డిసెంబర్లో జిల్లా సరాసరి నీటి మట్టం 4.19 మీటర్లు కాగా, 2020 డిసెంబర్లో 4.64 మీటర్లుగా ఉంది.
పెరిగిన సాగు.. ఆనందంలో అన్నదాతలు..
ప్రస్తుతం సాగు, తాగు నీటికి ఢోకా ఉండకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నది. పక్కా ప్రణాళికతో వేసవిలో నీటి ఎద్దడి సమస్య లేకుండా కృషి చేసింది. గతంలో నీటి కష్టాలతో ఒక పంటకే పరిమితమైన జిల్లా రైతులు నేడు రెండు పంటలూ వేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. నీల్వాయి ప్రాజెక్టు కింద 8 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీల్వాయి నుంచి క్యాతన్పల్లి ద్వారా ముల్కల్లపేట వరకు నీరు వెళ్తుంది. ఎడమ కాలువ ద్వారా గొర్లపల్లి వరకు నీరు వెళ్తుండగా, ఆయా ప్రాంతాల్లోని రైతులకు నీటి కరువు తీరింది. నీటి వనరుల లభ్యతతో రెండు పంటలూ వేసుకుంటున్నారు. మిషన్ కాకతీయ కింద పూడిక తీయడం, మరమ్మతులు చేపట్టడంతో చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో సాగుకు భరోసా వచ్చింది. గూడెం కింద కూడా పంటలు విపరీతంగా పండాయి. వానకాలం, యాసంగి పంటలకు పుష్కలంగా నీరందుతుండడంతో అన్నదాతలు ఆనందపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే మంచిర్యాల జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. 2019లో యాసంగిలో సాగు విస్తీర్ణం అంచనా 95,509 ఎకరాలు కాగా, 2,38, 772 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2020లో సాగు విస్తీర్ణం 1,10,815 ఎకరాలు కాగా, 2,77,037 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం అంచనా 15,306 ఎకరాలు, దిగుబడి 38,265 మెట్రిక్ టన్నులకు పెరిగింది.
సాగు నీటికి కొదవ లేదు..
వేమనపల్లి, ఏప్రిల్ 19 : గతంలో యాసంగి పంటలప్పుడు సాగు నీటి కోసం చాలా ఇబ్బంది పడ్డాం. ఈసారి నీల్వాయి ప్రాజెక్టు నీరు కూడా వస్తున్నది. సర్కారు ముందుచూపుతో రెండు పంటలకు కూడా నీరందుతున్నది. సాగు నీటిగండం తప్పడంతో చాలా సంతోషంగా ఉంది.