సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడినంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం, ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీహెచ్ కాలనీకి కోటా వెంకటేశ్ తాను దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడినైనందున తనకు ఇద్దరు గన్మెన్లు కావాలని, తన ఇంటి దగ్గర నిరంతరం పోలీసు గస్తీ నిర్వహించాలని గత కొంత కాలంగా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇందులో నిజానిజాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ జరిపారు. కాగా వెంకటేశ్ కేవలం సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా 2014-16 మధ్య కొనసాగాడని తేలింది.
సెంట్రల్ ఫిలిం సెన్సారు బోర్డు ప్యానల్ మెంబరుగా 2016 నుంచి 2018 వరకు మాత్రమే ఉన్నాడని తెలిసింది. ఆయా పదవుల గడువు ముగిసినా ఇంకా ఆ ఐడీకార్డులు పెట్టుకొని, భారతదేశ అధికారిక ముద్రలను కారుపై అతికించుకొని తానొక కేంద్ర ఉన్నతాధికారిగా చెప్పుకొని తిరుగుతున్నాడు. దీంతో వెంకటేశ్ బుధవారం ఆరెస్టు చేసి అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, తన కుమారుడు తనను పోషించడం లేదని, కనీసం అన్నం కూడా సరిగ్గా పెట్టడం లేదని వెంకటేశ్ తల్లి రెండు నెలల కిందటే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.