ధర్మపురి, మార్చి 25: ధర్మపురి లక్ష్మీ నారసింహుడి కల్యాణ వేడుకలు అశేష భక్తజనవాహిన మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో శాస్ర్తోక్తంగా దేవాలయంలోని శేషప్ప కళావేదికపై గురువారం అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు.
ముందుగా అర్చకులు శ్రీలక్ష్మీనారసింహ(యోగ,ఉగ్ర), శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తులను శేషప్ప కళావేదిక వద్దకు చేర్చి పట్టు వస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించి కల్యాణ వేదికపై అధిష్టింపజేశారు. యాజ్ఙాచార్యులు కందాళై పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో గోధూళి సముహూర్తాన స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జయ లక్ష్మీ నారసింహ జయజయ నారసింహ’ స్మరణతో ప్రాంగణమంతా మార్మోగింది. స్వామివారి కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శేషప్ప కళావేదిక ముందు, ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. భక్తులకు వీలుగా ఎక్కడికక్కడ ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు.