లండన్, ఆగస్టు 4: కరోనా థర్డ్వేవ్ చిన్నారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో తల్లిదండ్రులకు ఊరటనిచ్చే వార్త ఇది. కొవిడ్-19 బారిన పడిన పిల్లల్లో కనిపించే లక్షణాలు ఎక్కువకాలం ఉండబోవని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. వైరస్ లక్షణాలు ఉన్న చిన్నారుల్లో ఎక్కువమంది ఆరురోజుల్లోనే కోలుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ వివరాలు ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్ చైల్డ్ అండ్ అడాలెసెంట్’లో ప్రచురితమయ్యాయి. చిన్నారుల్లో వైరస్ తీవ్రత, లక్షణాలను అంచనా వేసేందుకు బ్రిటన్లోని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు 5-17 వయసున్న 2.5 లక్షల మంది పిల్లలపై 2020 సెప్టెంబర్ 1 – 2021 ఫిబ్రవరి 22 మధ్య ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ‘జో కొవిడ్’ యాప్ను ఈ అధ్యయనం కోసం వినియోగించారు.