ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు కత్తెర వేసి వాటిని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెట్టాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వం ఏ విధానపరమైన నిర్ణయం తీసుకున్నా దానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం ఉండాలనేది ‘ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) బిల్లు’ ప్రధాన అంశం.
వివాదాస్పద జీఎన్సీటీడీ సవరణ బిల్లును లోక్సభ సోమవారం ఆమోదించగా, రాజ్యసభలో దీనిపై బుధవారం తీవ్ర వాగ్వాదాలు కొనసాగాయి. సభ పలుమార్లు వాయిదా పడింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా విపక్ష నేతలు డిమాండ్ చేశారు. బిల్లు ప్రకారం.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం ఉంటేనే ప్రభుత్వ పథకాలు అమలవుతాయి. ఈ బిల్లు చట్టమైతే ఢిల్లీ శాసనసభ నామమాత్రమే. ప్రజామోదం పరిహాసానికి గురవుతుంది.
భారత్ ప్రజాస్వామిక దేశం. ప్రజలు ఎన్నుకున్నవారే పాలన సాగించాలి. అదే రాజ్యాంగ స్ఫూర్తి. అందుకే ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం ఉన్నచోట గవర్నర్లు అవసరం లేదన్న చర్చ రాజ్యాంగ రచన సమయంలో జరిగింది. అలాంటిది ఓ ప్రాంతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం పాలన సాగిస్తుండగా ఆ ప్రాం తంపై అధికారాలను అక్కడి ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తికి ఎలా కట్టబెడతారు? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా?
మా ప్రాంతంపై నిర్ణయాధికారం మాకే ఉండాలన్న ఢిల్లీ ప్రజల డిమాండ్తోనే 1991లో ఢిల్లీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ శాసనసభను ఏర్పాటు చేశారు. ఢిల్లీ భౌగోళిక స్వరూపం, దేశ రాజధానిగా దానికి ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా ఆ ప్రాంతంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉండవచ్చు. అందుకే పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలు, ఢిల్లీ భూభాగంపై చట్టాలు చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెట్టారు. ఈ అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్కు రాజ్యాంగబద్ధంగా సంక్రమించాయి. దీంతోపాటు ఢిల్లీ ప్రభు త్వం తీసుకొన్న నిర్ణయాలను రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం రాజ్యాంగంలోని 239 AA(4) ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉన్నది. దీన్ని సాకుగా తీసుకొని ప్రతి నిర్ణయాన్నీ రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, పథకాల అమలును నిలిపివేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్కు విశేషాధికారాలు సమా ఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇదివరలో వారంపాటు ధర్నా నిర్వహించారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. 2018లో ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నొక్కిచెప్పింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతీ అంశంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. విధానపరమైన నిర్ణయాలపై రాష్ట్రపతి పరిశీలన కోరడం- నిబంధనను కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే అనుసరించాలని సూచించింది. ప్రజల విశ్వాసంతోనే ప్రభుత్వం నెలకొని ఉన్నదన్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేసింది. అయినా కేంద్రం ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తగ్గిస్తూ తాజా బిల్లును తీసుకువచ్చింది. ఈ పరిణామం న్యాయవ్యవస్థను కూడా కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమే.