కోల్ కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రీకాల్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఎం మమతా బెనర్జీ కోరారు. ఈ వ్యవహారాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని దీదీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో న్యాయ పోరాటం చేపట్టే అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు. మరోవైపు యాస్ తుఫాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన సమీక్షా సమావేశానికి తాను హాజరు కాకపోవడం పట్ల మోదీ సర్కార్, ప్రధాని కార్యాలయం ఏకపక్ష, బూటకపు వార్తలను మీడియాకు చేరవేస్తోందని ఆమె మండిపడ్డారు.
తాను వేరే సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ప్రధాని అనుమతి తీసుకునే అక్కడి నుంచి వెనుదిరిగానని ఆమె స్పష్టం చేశారు. బెంగాలీల సంక్షేమం కోసం తాను ప్రధాని పాదాలను తాకేందుకు సిద్దమని అయితే తనను అవమానించడం తగదని ఆమె పేర్కొన్నారు. తుఫాన్ సమీక్షా సమావేశంలో ప్రధానితో తాను పాల్గొనాల్సి ఉన్నా సమావేశంతో సంబంధం లేని రాజకీయ నేతలను పిలిచారని ఆమె ఆక్షేపించారు.