న్యూఢిల్లీ: రూ.3,000 కోట్ల విలువైన 300 కేజీల మాదకద్రవ్యాలను నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక పట్టుకున్నది. అరేబియా సముద్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న ఒక చేపల బోటు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నది. ఐఎన్ఎస్ సువర్ణ యుద్ధ నౌక అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నది. దానికి ఒక బోటు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో నౌకలోని సిబ్బంది ఆ బోటులోకి వెళ్లి సోదాలు చేశారు. అందులో ఉన్న 300 కేజీలకుపైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
మార్కెట్లో దీని విలువ రూ.3000 కోట్టు ఉంటుందని నేవీ అధికారులు తెలిపారు. అనంతరం ఆ బోటును, అందులో ఉన్నవారిని కోచి పోర్ట్కు తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సముద్ర మార్గంలో భారీగా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్న విషయం దీని ద్వారా బయటపడిందని పేర్కొన్నారు.