వాషింగ్టన్: అమెరికా తొలి నల్లజాతి మాజీ విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్ కరోనాతో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ మేరకు సోమవారం ప్రకటించారు. ‘వాల్టర్ రీడ్ నేషనల్ మెడికల్ సెంటర్లోని వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము ఎంతో ప్రేమించే భర్త, తాత, గొప్ప అమెరికన్ను కోల్పోయాం’ అని పావెల్ కుటుంబం తెలిపింది. 84 ఏండ్ల కోలిన్ పావెల్ ప్రసంగ ధాటి, అత్యున్నత చిత్తశుద్ధి, ప్రజాస్వామ్యం పట్ల అమితమైన గౌరవం, సైనికుడిగా గౌరవ విధులను ప్రదర్శించారని ఆయన కుటుంబం కొనియాడింది. ఆయనలోని ఈ లక్షణాలు ఈ దేశ ప్రజలకు గొప్ప ప్రతినిధిగా చేశాయని సోషల్ మీడియాలో పేర్కొంది.
అమెరికా వార్ హీరో అయిన కోలిన్ పావెల్ రిటైర్డ్ ఫోర్-స్టార్ జనరల్. నలుగురు అధ్యక్షులకు సేవలందించిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాజీ ఛైర్మన్. రాజకీయ గొడవలకు దూరంగా ఉండే గౌరవప్రదమైన వ్యక్తిగా ఆయన ఖ్యాతిని గడించారు. 2000లో జార్జ్ బుష్ అడ్మినిష్ట్రేషన్లో అమెరికా విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 2003లో ఇరాక్పై అమెరికా యుద్ధంలో ఆయన కీలక పాత్ర వహించారు.
2003 ఫిబ్రవరిలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రసంగించిన కోలిన్ పావెల్, ఇరాక్లో సామూహిక విధ్వంసక రసాయన ఆయుధాలు ఉన్నట్లు ఆరోపించారు. అయితే నాడు ఆయన సమర్పించిన ఆధారాలు తప్పని ఆ తర్వాత నిరూపితమైంది. 2005లో ఏబీసీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆయన చాలా బాధపడ్డారు.