యాదాద్రి, జూలై4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం కిటకిటలాడిం ది. సెలవు రోజు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. వాహనాలతో ఆలయ ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. స్వామివారి ఘాట్ రోడ్డు నుంచి యాదగిరిగుట్ట రోడ్డు వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలయ పునర్నిర్మాణ పనులతోపాటు భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో కొండపైకి వాహనాలను అనుమతించలేదు. స్వామివా రి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచే మొదలైంది. నిజాభిషేకం తో అర్చకులు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా స్వామివారిని కొలిచారు.
సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపా రు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణమహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నా రు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకుపైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకను భక్తులు వీక్షించి తరించారు. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణంలో పాల్గొనడంతో ఆదాయం పెరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడుసేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
వైభవంగా వ్రత పూజలు..
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండకింద గల శిల్పారామంలో సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. భక్తులు పాల్గొని వ్రతమాచరించారు.శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధ్దలతో పూజలు నిర్వహించారు.
స్వామివారి ఖజానాకు రూ.21,04,464 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 21,04,464 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్తో రూ.3,35,118, రూ.100 దర్శనంతో రూ.19,900, వీఐపీ దర్శనాలతో రూ. 2,77,050, నిత్యకైంకర్యాలతో రూ.3,600, సుప్రభాతంతో రూ.2,200, క్యారీబ్యాగులతో రూ.8,000, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ.1,02,500, కల్యాణకట్టతో రూ. 52,400, ప్రసాద విక్రయంతో రూ.8,33,770, శాశ్వతపూజల ద్వారా రూ.23,580, వాహనపూజలతో రూ.18,100, టోల్గేట్తో రూ.1,850, అన్నదాన విరాళంతో రూ.49,466, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,20,120, యాదరుషి నిలయంతో రూ.1,00,060, పాతగుట్టతో రూ. 75,750, టెంకాయల విక్రయాలతో రూ. 81,000 కలుపుకొని రూ. 21,04,464 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.
పాతగుట్టలో ద్వార ఉద్వాసన పూజలు
లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి గర్భాలయ ముఖ ద్వార ఉద్వాసన పూజలు జరిగాయి. స్వామివారి గర్భాలయ ద్వారం వెడల్పు పెంచి నూతనంగా ద్వారాన్ని నిర్మించేందుకు ఆలయ అధికారులు పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గర్భాలయం తొలగింపు ప్రక్రియను చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, పాతగుట్ట ప్రధానార్చకుడు మోహనాచార్యులు, అధికారులు భాస్కర్శర్మ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న మేజర్ జనరల్ ఆర్కే సింగ్..
లక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్కే సింగ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
రేపు స్వామివారి హుండీ లెక్కింపు..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి హుండీని ఈ నెల 6వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. ఉదయం 8 గంటలకు యాదాద్రి కొండపైన గల హరితభవన్లో ఈ లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు.
స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జన్మదిన వేడుక ఆదివారం యాదాద్రిలో ఘనంగా జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి యాదాద్రి కొండపైన గల హరితహోటల్లో బస చేశారు. అనంతరం ఆయన కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కేక్కట్ చేసి, మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఆరు మిషన్ భగీరథ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను మంజూరు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్ మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటంరాజు, కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, ఆవుల మమత, సురేందర్, కో-ఆప్షన్ సభ్యులు ఎండీ రిజ్వానాయాకుబ్, నాయకులు కాంటెకార్ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.