వాషింగ్టన్/ కాబూల్: అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ విలియమ్ బర్న్స్ తాలిబన్ల నాయకత్వంతో రహస్య చర్చలు జరిపారు. ఇందుకోసం అమెరికా నుంచి సోమవారం కాబూల్కు చేరుకున్నారు. కాబూల్ విమానాశ్రయంలో రాకపోకలపై ఆంక్షలు విధించడంతోపాటు ఆఫ్ఘన్లు దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించబోమని తాలిబన్లు ప్రకటించారు.
మరోవైపు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 31 లోపు సేనలు ఆఫ్ఘనిస్థాన్ వీడి వెళ్లాల్సిందేనని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తాలిబన్లు హెచ్చరించిన నేపథ్యంలో వారితో సీఐఏ డైరెక్టర్ విలియమ్ బర్న్స్ రహస్యంగా సమావేశం కావడం గమనార్హం. తాలిబన్లతో విలియమ్ బర్న్స్ ఏం చర్చించారన్న సంగతి వెల్లడి కాలేదు.
ఖతార్లో ఇంతకుముందు జరిగిన చర్చలకు సారధ్యం వహించిన తాలిబన్ల నేత అబ్దుల్ ఘనీ బరాదర్తో విలియమ్ బర్న్స్ సమావేశమైనట్లు సమాచారం. ఆఫ్ఘన్ సంక్షోభంపై మంగళవారం జీ-7 దేశాల అధినేతలు చర్చించనున్న నేపథ్యంలో కాబూల్లో విలియమ్ బర్న్స్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికా సారధ్యంలోని నాటో కూటమి సేనలను మరికొంత కాలం ఆఫ్ఘన్లో కొనసాగించాలని జీ-7 సమావేశం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి బ్రిటన్, ఫ్రాన్స్ మరింత గడువు కోరనున్నాయని సమాచారం.