క్యుఝౌ: వేగంగా సెలెబ్రిటీలుగా ఎదగడం కోసం ఈ మధ్య కొంతమంది ఎంత సాహసమైనా చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ తదితర మాధ్యామాలను అందుకు వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు. తొందరగా ఫేమస్ అయిపోవాలన్న తపనతో వారు చేస్తున్న సాహసాలవల్ల ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా చైనాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. చైనాకు చెందిన 23 ఏండ్ల టిక్ టాక్ స్టార్ జియావో క్యుమీ.. భారీ క్రేన్ పై 160 అడుగుల ఎత్తులో వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కాలుజారి కింద పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అయితే, అంత ఎత్తులపై నుంచి వీడియోలు చేయడం జియావో క్యుమీకి కొత్తేమీ కాదు. ఆమె అలాంటి వీడియోలతోనే చాలా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలోనే మంగళవారం కూడా ఆమె తన ఉద్యోగ విధులు ముగిసిన తర్వాత టిక్ టాక్లో వీడియో పెట్టడం కోసం లైవ్ స్ట్రీమింగ్కు వెళ్లింది. వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగానే క్రేన్ పై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. అయితే, ప్రమాదంలో ఆమె ఫోన్ చేతిలో పట్టుకుని క్రేన్ పై నుంచి పడిపోతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు కాలేదు. అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా, ప్రొఫెషనల్ క్రేన్ ఆపరేటర్గా పనిచేసే జియావో క్యుమీ తరచుగా విధులు ముగిసిన వెంటనే ఆ క్రేన్ నుంచే పలు వీడియోలు చేస్తూ ఉండేది. ఇలా అనేక వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ స్టార్గా పాపులర్ అయ్యింది. అందుకే మంగళవారం కూడా జియావో సహోద్యోగులంతా ఇంటికి వెళ్లిపోయిన తర్వాత క్రేన్ క్యాబిన్లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అంతలోనే ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడిపోయింది.
ఇదిలావుంటే, టిక్టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్ ప్లాట్ఫాంలో లక్షమంది మంది ఫాలోవర్లతో జియావో క్యుమీ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆమె డ్యాన్స్ వీడియోలు కూడా భారీ క్రేజ్ను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జియావో ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఇటీవల హాంగ్కాంగ్లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. డేర్డెవిల్ ఇన్ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ జలపాతం సమీపంలో ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు చనిపోయింది.