బీజింగ్, మే 9: కొన్ని రోజులుగా ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేసిన చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బీ’ శకలాలు ఆదివారం హిందూమహా సముద్రంలో కూలాయి. శకలాలు కూలిన ప్రాంతం మాల్దీవులకు సమీపంలో ఉన్నది. ఆదివారం ఉదయం 10.24 గంటలకు రాకెట్ శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించినట్టు చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజినీరింగ్ కార్యాలయం తెలిపింది. వాతావరణంలోకి ప్రవేశించగానే చాలా వరకు శకలాలు మండిపోయాయని, మిగతావి 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలోని సముద్ర జలాల్లో పడ్డట్టు వెల్లడించింది. ఈ ఘటనలో ఏ రకమైన ప్రమాదం జరుగలేదని వివరించింది. మరోవైపు, రాకెట్ శకలాలు నివాసిత ప్రాంతాల్లో పడినట్లయితే పరిస్థితి ఏంటని ‘నాసా’ మండిపడింది. రాకెట్ ప్రయోగం, నిర్వహణలో చైనా బాధ్యతారాహిత్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాకెట్ శకలాలు సముద్రంలో కూలుతున్నాయని పేర్కొంటూ కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.