మేడ్చల్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తాను ఇప్పటికే దత్తత తీసుకొన్న కీసర అటవీ ప్రాంతంతోపాటు కీసర గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని రాజ్యసభసభ్యుడు సంతోష్కుమార్ ప్రకటించారు. గ్రామంలో వైకుంఠధామాలు, బస్టాప్, షాపింగ్ కాంప్లెక్స్, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. తన శక్తిని ధారపోసి, గ్రామం లో సమస్యలు లేకుండా చూసే బాధ్యత తీసుకొంటానని పేర్కొన్నారు. మంత్రులను కలిసి, గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని అభయమిచ్చారు. హరితహారంలో భాగంగా మంగళవారం ఆయన మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్ జిల్లా కీసర అటవీప్రాంతంలోని నూర్మహ్మద్ కుంట సమీపంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ కీసరలో నిర్వహించిన 4వ విడత పల్లెప్రగతి గ్రామసభకు విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. పుణ్యక్షేత్రం కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ప్రాంత అభివృద్ధికి పాటుపడటం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. సినీనటుడు ప్రభాస్, హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి వంటివారు కీసర అటవీ ప్రాంత అభివృద్ధికి ముందుకొచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. 210 కోట్ల మొక్కలను నాటించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో 24 శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచి తెలంగాణను ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపారని చెప్పారు.
ఏడేండ్లలో ఎంతో అభివృద్ధి: మంత్రి మల్లారెడ్డి
ఏడేండ్లలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంపీ సంతోష్కుమార్ దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, అటవీశాఖ పీసీఎఫ్ శోభ, పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, అదనపు కలెక్లర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.