జైలు స్థలంలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల
కేంద్ర కారాగారాన్ని తరలించి, ఓపెన్ జైలుగా మార్పు
ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్
వరంగల్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ను మెడికల్ హబ్గా మార్చే ప్రక్రియలో కీలకమైన ముందడుగు పడింది. వరంగల్ సెంట్రల్ జైలును నగర శివారులోకి తరలించి, ఓపెన్ ఎయిర్ జైలుగా మారుస్తామని, దాని స్థానంలో సకల సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ ఎంజీఎం దవాఖానను అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం ఇక్కడికి వచ్చేలా సకల సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుకుందామన్నారు. అలాగే, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వెంటనే పటిష్ట పరుచుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వరంగల్ సెంట్రల్ జైలును ఇక్కడి నుంచి తరలించి, నగర శివారులో విశాలమైన ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ ఏర్పాటు చేసుకుందామన్నారు. సెంట్రల్ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులా, ఖైదీల పరివర్తన కేంద్రంగా నిర్మించుకుందామని చెప్పారు. ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులతో ఆయన చర్చించారు. సాధ్యాసాధ్యాల కోసం త్వరలోనే నిపుణుల కమిటీని పంపిస్తామని ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ చెప్పారు.