నిడమనూరు/హాలియా, ఏప్రిల్ 2 నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందారు. పెద్దవూర మండలం తెప్పలమడుగు టీఆర్ఎస్ సర్పంచ్ తరి శ్రీను, భార్య విజయ, కుమార్తె శ్రీవిద్య (5), కుమారుడు కన్నయ్య (3)తో కలిసి బైక్పై నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో తన బామ్మర్ధి కొడుకు అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్తున్నాడు. నిడమనూరు మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున వాహనాల రాకపోకలు ఒకవైపున ఉన్న రోడ్డు గుండానే సాగుతున్నాయి. నిడమనూరు మండల కేంద్రంలో మిర్యాలగూడ నుంచి మల్ల్లేపల్లికి అతివేగంతో వెళ్తున్న బియ్యం లారీ ఎదురుగా వస్తున్న పుచ్చకాయల లోడుతో ఉన్న టాటాఏస్ ట్రాలీని ఢీకొట్టి.. సుమారు 30 అడుగుల దూరం వరకు లాక్కెళ్లింది. కుడివైపు రహదారి డివైడర్ను దాటి వెళ్లిన లారీ హాలియా నుంచి నిడమనూరు వైపునకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న తరి శ్రీను బైక్ను ఢీకొట్టి అతడి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో శ్రీను, ఆయన భార్య విజయ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారులను 108లో మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇదే ప్రమాదంలో టాటాఏస్ డ్రైవర్ దస్తగిరి, అందులో ప్రయాణిస్తున్న ముప్పారం గ్రామానికి చెందిన కొల్లి నాగరాజు, ఆయన కుమారుడు యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. టాటాఏస్లో ప్రయాణిస్తున్న వెంకటమ్మ, అశోక్ సురక్షితంగా బయటపడ్డారు.
స్తంభించిన రాకపోకలు
నిడమనూరులో ప్రధాన రహదారిపై ప్రమాదం కారణంగా సుమారు మూడు గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్డుకు అడ్డుగా వాహనాలు నిలిచిపోవడం, వందలాది మంది ప్రజలు ప్రమాద ఘటన వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంతం స్తంభించింది. లారీ బంపర్ కింద సర్పంచ్ తరి శ్రీను మృతదేహం ఇరుక్కుపోవడంతో నిడమనూరు ఎస్ఐ కొండల్రెడ్డి క్రేన్ను రప్పించి బయటకు తీశారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధ్దీకరించారు. పోలీసులు తరి శ్రీను బంధువులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న శ్రీను బంధువులు మృతదేహాలపై పడి రోదించిన తీరు అక్కడున్నవారిని కంట తడి పెట్టించింది. మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వర్రావు, హాలియా సీఐ వీరరాఘవులు ప్రమాద ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు హాలియా సీఐ వీర రాఘవులు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవీ కూడా చదవండి..
కరోనా వచ్చినా మీటింగ్.. పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై విమర్శలు
సుయెజ్ కాలువలో ట్రాఫిక్ జామ్.. నష్టమెంత?
ప్రధాని మోదీకి బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం
ఎలన్ మస్క్కు వార్నింగ్ ఇచ్చిన కార్మిక శాఖ
లేని సమస్యలు సృష్టించొద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్
మయన్మార్లో 300 దాటిన మృతుల సంఖ్య