కరోనా నిబంధనలు పాటించాలి
పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు
మామునూరు ఏసీపీ నరేశ్కుమార్
కరీమాబాద్, ఏప్రిల్ 28 : వరంగల్ మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ సూచించారు. సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బందితో మామునూరులో బుధవారం సమావేశం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ నరేశ్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 30న ఎన్నికలు సజావుగా జరిగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశామని, ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు ఉన్న వారు మాత్రమే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, మిగిలిన వారు వారి ఊళ్లకు వెళ్లాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఓటర్లు మాస్కులు తప్పకుండా ధరించాలన్నారు. క్యూ లైన్లో భౌతిక దూరం పాటించాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు సూచించిన విధంగా పార్టీల నాయకులు, ప్రజలు నడుచుకోవాలన్నారు. సెల్ఫోన్, కెమెరా, వాటర్బాటిల్స్, ఇంకు పెన్నులు, అగ్గిపెట్టె, డిజిటల్ గడియారాలు, ఇతర వస్తువులు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదన్నారు. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. ప్రజలకు రక్షణగా మేమున్నామని భరోసానిచ్చారు. మామునూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.