బీజింగ్: చైనీస్ ఆర్మీ మరో ఎత్తుగడ వేస్తోంది. ఇండియాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఆపరేషన్ల కోసం టిబెట్ యువతను ఆర్మీలోకి తీసుకొని శిక్షణ ఇస్తోంది. ప్రత్యేకమైన ఆపరేషన్ల కోసం వీళ్లను ఉపయోగించుకోవడానికి వారిని ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నట్లు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. టిబెట్ యువతను ఆర్మీలో చేర్చుకునే ముందు వారి విధేయతను కూడా పరీక్షిస్తోంది. మెయిన్ల్యాండ్ చైనీస్ భాషను వారికి నేర్పడంతోపాటు ఇతర అన్ని విశ్వాసాల కన్నా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకే కట్టుబడి ఉండేలా వారిని తయారు చేస్తోంది. దలై లామాతోపాటు ఇతర మత పెద్దల బాటలో వాళ్లు వెళ్లకుండా జాగ్రత్త పడుతోంది.
ఇండియా ఎస్ఎఫ్ఎఫ్కు పోటీగా..
ఈ ఏడాది మొదటి నుంచీ ఇలా టిబెట్ యువతను తన ఆర్మీలో చేర్చుకోవడం మొదలుపెట్టింది చైనా. టిబెట్ వదిలి వచ్చి ఇండియన్ ఆర్మీలోని స్పెషల్ ఫ్రంటైర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్)లో పని చేస్తున్న టిబెటన్లను చూసిన తర్వాతే చైనా ఈ ఎత్తుగడ వేసింది. 1962లో చైనాతో యుద్ధం తర్వాత ఈ ఎస్ఎఫ్ఎఫ్ను తయారు చేశారు. వీళ్లకు ఇండియన్ ఆర్మీ, అమెరికాకు చెందిన సీఐఏ శిక్షణ ఇచ్చారు. ఈ ఫోర్స్లో ఎక్కువ మంది టిబెటన్లే ఉన్నారు. నిజానికి గతేడాది పాంగాంగ్ సరస్సు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇండియన్ ఆర్మీలోని ఈ ఎస్ఎఫ్ఎఫే చైనా సైనికులను బోల్తా కొట్టించి అక్కడి మోఖ్పారిని తిరిగి ఆక్రమించింది.
చైనాకు ఎన్నో ప్రయోజనాలు
టిబెట్ యూత్ను తమ ఆర్మీలో చేర్చుకోవడం ద్వారా చైనాకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. టిబెటెన్ అటానమస్ రీజియన్లోని యువతలో చైనీస్ ఆర్మీకి పట్టు పెంచుకోవడంతోపాటు లఢాక్లోని పర్వత ప్రాంతంలో కాపలా కాస్తున్న చైనా మెయిన్ల్యాండ్ సైనికులపై ఉన్న ఒత్తిడి కూడా కాస్త తగ్గుతుందని చైనా భావిస్తోంది.