బీజింగ్: వుహాన్ ( Wuhan ) నగర ప్రజలందరికీ మళ్లీ కరోనా వైరస్ పరీక్షలు చేపట్టనున్నారు. ఏడాది క్రితం చైనాలోని వుహాన్లోనే తొలుత కరోనా ( Corona Virus ) కేసులు ప్రబలిన విషయం తెలిసిందే. వుహాన్ నగరంలో సుమారు కోటిన్నర మంది నివాసితులు ఉన్నారు. అయితే వారందరికీ సమగ్ర న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేయనున్నట్లు ఆ నగర అధికారి లీ టావో తెలిపారు. నగరంలో ఉన్న ఏడు మంది వలస కార్మికులకు మళ్లీ వైరస్ సంక్రమించినట్లు గుర్తించారు. ఇటీవల మళ్లీ వైరస్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చైనాలోని అన్ని నగరాల్లోనూ ఆంక్షలను కఠినతరం చేశారు. వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్ను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది. మంగళవారం కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి. బీజింగ్తో పాటు అన్ని ప్రధాన నగరాల్లో వైరస్ పరీక్షల జోరును పెంచారు. యాంగ్జూ నగరంలో ఉన్న 13 లక్షల మంది పౌరులను ఇండ్లకే పరిమితం చేశారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కరికి మాత్రమే బయటకు వెళ్లే అవకాశం కల్పించారు.