బీజింగ్ : ఇప్పటికే సొంతంగా అంతరిక్ష ప రిశోధనా కేంద్రాన్ని నిర్మించుకుంటున్న చైనా 2033 కల్లా అం గారక గ్రహం మీదకు తమ మనుషులను పంపించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. పంపించడమే కాదు వారు అక్కడ పరిశోధనలు చేయడానికి వీలు ఓ కేంద్రాన్ని నిర్మించాలని భావిస్తున్నది. చైనా ఇప్పటికే మార్స్ మీదకు రోవర్ను పంపి అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నది. 2033, 2035, 2037, 2041 సంవత్సరాల్లో మానవసహిత అంగారక యాత్రలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు అధికారులు తెలిపారు. అక్కడికి మనుషులను పంపడానికి ముందు రోబోలను పంపి వనరులు వెలికితీయడానికి, పరిశోధన కేంద్రాన్ని నిర్మించడానికి అనువైన స్థలాన్ని అన్వేషించనున్నారు. 2030లో మానవరహిత అంతరిక్ష యాత్ర నిర్వహించి అక్కడి మట్టిని తీసుకురానున్నారు. మొత్తంగా మార్స్-భూమికి మధ్య రాకపోకలే లక్ష్యంగా పరిశోధనలు నిర్వహించనున్నట్టు చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికిల్ టెక్నాలజీ హెడ్ వాంగ్ తెలిపారు.