రుయిలీ: చైనాలోని రుయిలీ నగర ప్రజలందరికీ కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఆ నగరంలో సుమారు మూడు లక్షల జనాభా ఉంది. మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఆ నగరంలో తాజాగా 15 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం.. రుయిలీ నగర ప్రజలందరికీ టీకా ఇవ్వాలని భావిస్తున్నది. యునాన్ ప్రావిన్సులో రుయిలీ నగరం ఉన్నది. ప్రస్తుతం ఆ నగర ప్రజలంతా హోం క్వారెంటైన్లో ఉన్నారు. గత రెండు నెలల వ్యవధిలో చైనాలో ఒకేసారి ఒక నగరంలో 15 కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఆ నగరంలో టీకా ప్రక్రియను వేగవంతం చేశారు. మయన్మార్తో బోర్డర్ ఉన్న ఆ నగరంపై చైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మయన్మార్లో సైనిక ఊచకోత సాగుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి ప్రజలు భారీ ఎత్తున వలస వెళ్తారు. ఆ దేశ పౌరుల్లోనే పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు చైనా అనుమానం వ్యక్తం చేసింది. చైనా దేశ వ్యాప్తంగా దాదాపు కరోనాను అదుపులో ఉంచారు. అయితే ఒక్కడ వైరస్ పాజిటివ్ కేసులు అధికమయితే, అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు.