బీజింగ్ : టిబెట్లో చైనా తొలి ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ రైలును శుక్రవారం ప్రారంభించింది. టిబెట్ రాజధాని లాసా, నింగ్చి నగరాల మధ్య ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. నింగ్చి నగరం భారత్లోని అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపాన ఉన్నది. 435.5 కిలోమీటర్ల ఈ రైలు మార్గం నిర్మాణ పనులను 2014లోనే చైనా మొదలు పెట్టింది. టిబెట్లో పూర్తిస్థాయిలో విద్యుదీకరించిన మొదటి రైల్వే లైన్ ఇదే. అలాగే ఆ ప్రాంతంలో చైనా ప్రారంభించిన రెండో రైల్వే లైన్ ఇది. ఈ రైలు మార్గంతో సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూ నుంచి లాసా మధ్య ప్రయాణ సమయం 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గనుందని చైనా అధికారిక మీడియా తెలిపింది. కాగా, సరిహద్దుల్లో స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఈ రైలు మార్గం కీలక పాత్ర పోషిస్తుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గతంలో పేర్కొన్నారు. అభివృద్ధి పనుల ముసుగులో సరిహద్దుల్లోకి తమ బలగాలను వేగంగా తరలించేందుకే చైనా ఈ రైలు మార్గాన్ని నెలకొల్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి.