బీజింగ్: వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకనట్లు ఇటీవల అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం రాసిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆ ల్యాబ్లోని ముగ్గురు పరిశోధకులు 2019లోనే కరోనాతో సతమతం అయినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన కథనాన్ని చైనా ఖండించింది. ఆ కథనాన్ని రాసిన రిపోర్టర్ మైఖేల్ గోర్డన్ను కూడా డ్రాగన్ దేశం తీవ్రంగా తప్పుపట్టింది. 20 ఏళ్ల క్రితం ఇరాక్పై అమెరికా యుద్ధానికి వెళ్లడానికి కూడా ఆ రిపోర్టరే కారణమంటూ చైనా విదేశాంగ శాఖ ఆరోపణలు చేసింది. ఇరాక్లో అణ్వాయుధాలు ఉన్నాయని, సద్దాం హుస్సేన్ అణుబాంబులు తయారు చేసేందుకు యురేనియం నిల్వలను పెంచుకుంటున్నట్లు అప్పట్లో అమెరికా మీడియాలో ఓ కథనం వచ్చింది. ఆ కథనాన్ని మైఖేల్ గోర్డన్ మరొకరితో కలిసి రాశారని, ఇప్పుడు వుహాన్ ల్యాబ్ లీకేజీ కథను కూడా ఆయనే అల్లినట్లు చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు. 20 ఏళ్ల క్రితం తప్పుడు కథనం రాయడం వల్ల ఇరాక్పై యుద్ధానికి వెళ్లిన అమెరికాకు ఎటువంటి మానవ హనన ఆయుధాలు చిక్కలేదని చైనా పేర్కొన్నది.
వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన వుహాన్ ల్యాబ్ లీక్ కథనం వల్ల .. వైరస్ ఆనవాళ్ల గురించి లోతుగా అధ్యయనం చేయాలని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. వుహాన్ ల్యాబ్ లీక్ కథనాన్ని రాసిన గోర్డన్ .. వాల్ స్ట్రీట్ జర్నల్లో చేరడానికి ముందు న్యూయార్క్ టైమ్స్లో మిలిటరీ, డిప్లమాటిక్ కరెస్పాండెంట్గా 30 ఏళ్లు చేశారు. ఇరాక్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి కథనం రాసి గోర్డన్ వివాదాన్ని సృష్టించారని చైనా ఆరోపించింది. అయితే ఇప్పుడు కూడా అదే తరహాలో వుహాన్ ల్యాబ్ లీక్ కథనాన్ని ప్రేరేపిస్తున్నారని వాంగ్ పేర్కొన్నారు. నిజానికి తొలుత ల్యాబ్ లీక్ ఆరోపణలను ఖండించిన అమెరికా అంటువ్యాధి నిపుణుల డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఇప్పుడు స్వరం మార్చారు. దీంతో చైనా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని వాల్ స్ట్రీట్ కథనాన్ని తప్పుపట్టింది. అస్వస్థతకు గురైన ముగ్గురి పరిశోధకుల మెడికల్ రికార్డ్స్ కావాలంటూ ఇటీవల ఫౌసీ కోరారు. ఈ నేపథ్యంలో చైనా స్పందించాల్సి వచ్చింది. 2012లో గబ్బిలాల గుహకు వెళ్లిన ఆరుగురు మైనర్ల సమాచారం కూడా కావాలని ఫౌసీ డిమాండ్ చేశారు. సార్స్ సీఓవీ2 అక్కడి నుంచి వ్యాపించి ఉంటుంది లేదా ల్యాబ్ నుంచి అయినా వ్యాప్తి చెంది ఉంటుందని ఫౌసీ డౌట్ వ్యక్తం చేశారు.