ముంబై : కరోనా వైరస్ థర్డ్ వేవ్ ను అధిగమించాలంటే ఎక్కువ మంది ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ అన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనా 45 ఏండ్లు పైబడినవారికి సైతం వ్యాక్సిన్ వేయడంలో ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారు ఇంకా రెండో డోసు కోసం వేచిచూస్తున్నారని, వారికి ముంబైలోని 59 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రెండో డోసు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
మార్చి ద్వితీయార్దం నుంచి ముంబైలో తొలిసారిగా కరోనా కేసుల సంఖ్య అతితక్కువగా నమోదైన నేపథ్యంలో ముంబై మేయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే అత్యధిక జనాభాకు వ్యాక్సినేషన్ జరగాలని ఆమె నొక్కిచెప్పారు. ఇక సోమవారం ముంబైలో కనిష్టంగా 2662 తాజా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మార్చి నుంచి ఒక్కరోజులో ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి.