బీజింగ్, మే 15: అంతరిక్ష పరిశోధనల్లో చైనా చరిత్ర సృష్టించింది. అమెరికా తర్వాత అంగారక గ్రహంపైకి రోవర్ను విజయవంతంగా పంపిన దేశంగా రికార్డులకెక్కింది. తమ రోవర్ ‘జురాంగ్’ అంగారక గ్రహంపై ల్యాండ్ అయినట్టు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. ‘తియాన్వెన్-1 మిషన్ విజయవంతం అయింది’ అని సీఎన్ఎస్ఏ అధినేత జాంగ్ కిజియాన్ తెలిపారు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.48 గంటలకు జురాంగ్ మార్స్ ఉత్తరార్ధ గోళంలో యుటోపియా ప్లానెటియా ప్రాంతంలో దిగింది. తర్వాత 17 నిముషాలకు దాని నుంచి భూమికి సంకేతాలు అందాయి. జురాంగ్ను మార్స్ మీదకు ప్రయోగించడంలో భాగంగా చైనా తియాన్వెన్-1 మిషన్ను ప్రారంభించింది. జూలై 23న ఆర్బిటార్, ల్యాండర్, రోవర్తో కూడిన రాకెట్ను అంతరిక్షంలోకి పంపించింది. ఫిబ్రవరిలో రోవర్ అంగారకుడి కక్ష్యలో చేరింది. మిషన్ విజయవంతం కావడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలను అభినందించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైన్స్ విభాగం అధిపతి థామస్ జుర్బూకెన్ కూడా చైనా పరిశోధకుల బృందాన్ని అభినందించారు.
జురాంగ్ రోవర్కు ఆరు చక్రాలు ఉన్నాయి. బరువు 240 కిలోలు. ల్యాండర్ సహాయంతో ఇది మార్స్పైన దిగింది. ఇది దిగిన స్థలం పర్వతాలు, ఎగుడుదిగుడులతో కూడుకొన్నది. ఇక్కడ నుంచి రోవర్ మూడు నెలల పాటు మార్స్ ఉపరితలంపై సమాచారాన్ని అందించనున్నది. 1976లో అమెరికా కూడా మార్స్పై యుటోపియా ప్లానెటియా ప్రాంతంలోనే వైకింగ్-2 రోవర్ను దించింది. అంగారక చరిత్ర తెలుసుకొనే తొలి పరిశోధనలకు ఇది ఎంతో ఉపయోగపడింది.