బీజింగ్: చైనా ( China) లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 13వ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ముగిశాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం దక్కింది. జనాభా, కుటుంబ నియంత్రణ చట్టాన్ని కూడా సవరించారు. దీంతో ముగ్గురు పిల్లల విధానానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆ చట్టాలను అమలు చేయాలన్న పత్రాలపై చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సంతకం చేశారు. చైనాలో 60 ఏళ్ల వయసు దాటిన వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఇవాళ ఆ దేశం ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గత 40 ఏళ్ల నుంచి ఆ దేశంలో ఒక జంట ఒక్కర్నే కనాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు జనాభా, కుటుంబ నియంత్రణ చట్ట సవరణతో ఆ సంఖ్య మూడుకు చేరింది.
త్రీ చైల్డ్ పాలసీ..
ముగ్గురు పిల్లల్ని కనే దంపతులకు చైనా ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వనున్నది. ఫండింగ్, ట్యాక్సేషన్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, హౌజింగ్, ఎంప్లామెంట్లో వారికి చేయూతనివ్వనున్నారు. గత మే నెలలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ త్రీ చైల్డ్ పాలసీని సమర్ధించింది. ఇది దేశ జనాభా స్వరూపాన్ని మార్చేస్తుందని, వయసు మళ్లుతున్న వారి సంఖ్యకు తగినట్లు కొత్త తరం వస్తుందన్నారు. 2020 జనాభా లెక్కల ప్రకారం.. చైనా జనాభాలో 60 ఏళ్లు దాటిన వారు 18.7 శాతం ఉంది. 2010తో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. రెండో బిడ్డను కనేందుకు 2013లో చైనా ఆమోదించింది. పెళ్లి చేసుకున్న దంపతులు కచ్చితంగా ఇద్దర్ని కనవచ్చు అంటూ 2016లో మరో చట్టం చేశారు.
డేటా ప్రైవసీ..
త్రీ చైల్డ్ పాలసీతో పాటు వ్యక్తిగత డేటా ప్రైవసీ రక్షణ చట్టానికి కూడా ఎన్సీపీ ఆమోదం తెలిపింది. వ్యక్తిగత సమాచార భద్రత చట్టం నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది. బయోమెట్రిక్స్, మెడికల్, హెల్త్, ఫైనాన్షియల్ లాంటి సున్నిత అంశాలు సేకరిస్తున్న సమయంలో వ్యక్తిగత ఆమోదం తప్పనిసరి అవుతుంది. డాక్టర్ల రక్షణ కోసం కూడా కొత్త చట్టాన్ని ఆమోదించారు. హెల్తీ చైనా వ్యూహాం అమలు కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. 2022, మార్చి ఒకటో తేదీ నుంచి ఆ చట్టం అమలవుతుంది. అవినీతి అంతానికి కూడా మరో చట్టాన్ని తెచ్చారు. నాలుగు దశల్లో యాంటీ కరప్షన్ బ్యూరో పనిచేస్తుంది. ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వస్తుంది.