న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై బుధవారం చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము భారత్లో అంతర్భాగంగా భావించని అరుణాచల్లో ఉప రాష్ట్రపతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 9న వెంకయ్యనాయుడు ఆ రాష్ట్రంలో పర్యటించి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన ఈశాన్య భారతంలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోందని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. అయితే అరుణాచల్ప్రదేశ్లో భారత నేతల పర్యటనలను వ్యతిరేకించడం చైనాకు అలవాటుగా మారింది. ఇండియా మాత్రం అరుణాచల్ తమ దేశంలో అంతర్భాగమని, మిగతా ప్రాంతాల్లో పర్యటించినట్లే ఆ రాష్ట్రంలోనే నేతలు పర్యటిస్తారని స్పష్టం చేసింది.
తాజాగా వెంకయ్య నాయుడు పర్యటనపై స్పందించాల్సిందిగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ను అక్కడి అధికార మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. సరిహద్దు అంశంలో చైనా స్థిరమైన, స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. చైనా ప్రభుత్వం ఎప్పుడూ అరుణాచల్ ప్రదేశ్ను భారత్లో రాష్ట్రంగా గుర్తించలేదు. ఇండియానే అక్రమంగా, ఏకపక్షంగా అరుణాచల్ ప్రదేశ్ను రాష్ట్రంగా గుర్తించింది. ఆ ప్రాంతంలో భారత నేత పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని అన్నారు.