ఖమ్మం, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత నగరాలు, పట్టణాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేయడంతో అవి ప్రగతి బాట పడుతున్నాయి. గడిచిన ఆరేళ్లలో నగరంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక చొరవతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు రూ.4 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు నగరానికి కొత్తకళను తీసుకువచ్చాయి. నగర పరిధిలోని అగ్రహారం వద్ద రూ.70 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి రెండు రాష్ర్టాలను కలుపుతున్నది. గతంలో బ్రిడ్డి లేకపోవడంతో ఈ ప్రాంతంలో ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రైల్వే బ్రిడ్జితో ఇప్పుడు ప్రయాణం సులువైంది. రూ.270 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులతో నగరంలో ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నది.
ఉపాధి నెలువు ఐటీ హబ్..
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.25 కోట్లతో నిర్మించిన మొదటి ఫేజ్ ఐటీ హబ్ ఇప్పుడు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. తాజాగా రూ.36 కోట్లతో రెండో దశ పనులు ప్రారంభమయ్యాయి. ఇది కూడా పూర్తయితే వందలాది మంది యువతకు ఉపాధి లభించనుంది. గతంలో గోళ్లపాడు చానెల్ ప్రాంతం అస్తవ్యస్తంగా ఉండేది. పరిస్థితిని గమనించిన మంత్రి అజయ్కుమార్ సుమారు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించి ఆధునీకరణ పనులు చేపట్టారు. అంతేకాదు ఆధునీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన పార్కులు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్బండ్
నగరవాసులకు ఆహ్లాదాన్ని పంపేందుకు రూ.50 కోట్లతో ట్యాంక్బండ్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా పర్యాటక ప్రాంతంగా మారింది. నగరానికే మణిహారమైంది. నగరంలోని కాల్వొడ్డు, బల్లేపల్లిలో అన్ని వసతులతో వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి. నగరంలో రోడ్ల విస్తరణ జరిగింది. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో నగరం కొత్త కళను సంతరించుకున్నది. ఖాళీస్థలాల్లో వాకింగ్ట్రాక్లు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడంతో నగరవాసులు ఉదయం, సాయంత్రం అక్కడ వ్యాయామం చేస్తున్నారు.
నూతన బస్టాండ్ ప్రారంభం..
ఆధునిక హంగులతో నగరంలో నూతన బస్టాండ్ అందుబాటులోకి వచ్చింది. రూ.25 కోట్ల నిధులతో మంత్రి అజయ్కుమార్ పనులు పూర్తి చేయించారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద బస్టాండ్గా రూపుదిద్దుకున్నది. నగరంలోని అన్ని డివిజన్లలో అంతర్గత రహదారులు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని ప్రాంతాలే కాక కార్పొరేషన్లో విలీనమైన ప్రాంతాల్లోనూ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక వినతి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్ల మంజూరు చేశారు. ఈ నిధులతో నగరాభివృద్ధి జరుగుతున్నది. నగరంలో రూ.4.5 కోట్లతో నిర్మించిన వెజ్ అండ్ నాన్వెజ్ సమీకృత మార్కెట్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. నగరంలో మరో రెండు మార్కెట్లు నిర్మించాలని మంత్రి పువ్వాడ అజయ్ ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మరోవైపు పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రఘునాథపాలెంలో ఆధునిక హంగులతో డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. టేకులపల్లిలో నిర్మించిన 1,006 ఇళ్లు కూడా ఇటీవల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.