బీజింగ్: డ్రాగన్ దేశం చైనా కొత్తగా నిర్మించిన అంతరిక్ష కేంద్రానికి తన వ్యోమగాములను పంపింది. ఇవాళ ఉదయం ముగ్గురు చైనా వ్యోమగాములు నింగికెగిరారు. లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా.. షెంన్జూ12 క్యాప్సూల్లో ఆస్ట్రోనాట్స్ వెళ్లారు. నీ హైషెంగ్, లయూ బోమింగ్, టాంగ్ హోంగ్బోలు.. అంతరిక్ష కేంద్రంలో మూడు నెలలు గడపనున్నారు. భూమికి 380 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తియాన్హీ మాడ్యూల్లో వాళ్లు ఉండనున్నారు. గోబి ఎడారిలో ఉన్న జిక్వాన్ శాటిలైట్ లాంచింగ్ కేంద్రం నుంచి రాకెట్ను ప్రయోగించారు. ఈ ప్రయోగంతో చైనా అంతరిక్ష పరిశోధనల్లో తన సత్తా మరోసారి చాటింది. ఇటీవలే చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి శ్యాంపిళ్లను చైనా తీసుకువచ్చింది. కొన్ని రోజుల క్రితమే మార్స్ గ్రహంపై ఆ దేశానికి చెందిన రోబో దిగింది. రెండు అసాధారణ పరీక్షల్లో చైనా సక్సెస్ కావడం విశేషం.
షెన్జూ-12 మిషన్లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ముగ్గురు వ్యోమగాములు.. అక్కడ ఉన్న తియాన్హీ మాడ్యూల్ను ఆపరేట్ చేయనున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నారు. తియాన్హీ సిలిండర్ను ఏప్రిల్లో చైనా ప్రయోగించింది. దాని పొడుగు 16.6 మీటర్లు.. వెడల్పు 4.2 మీటర్లు. ఆ పరికరం దాదాపు 70 టన్నులు ఉంటుంది. దాంట్లో లీవింగ్ క్వార్టర్స్, సైన్స్ ల్యాబ్స్, హబుల్ క్లాస్ టెలిస్కోప్లు ఉన్నాయి.
నిజానికి నింగికి ఎగిరిన ఆస్ట్రోనాట్ల గురించి చైనా చివరి నిమిషం వరకు వారి వివరాలను వెల్లడించలేదు. కేవలం ఒక రోజు ముందు మాత్రమే ఆ ముగ్గురు వ్యోమగాముల వివరాలు బయటపెట్టింది. 56 ఏళ్ల నీ హైషెంగ్.. చైనాలో ఎక్కువ అనుభవం ఉన్న ఆస్ట్రోనాట్. గతంలో రెండసార్లు అతను రోదసిలోకి వెళ్లాడు. 2013లో నీ హైషెంగ్ ప్రోటోటైప్ స్పేస్ స్టేషన్లో 15 రోజులు గడిపారు. ఇక మిగితా ఇద్దరు వ్యోమగాములకు ఎయిర్ఫోర్స్ అనుభవం ఉన్నది.