న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, దలైలామా ప్రతినిధితో సమావేశం కావడంపై చైనా గురువారం మండిపడింది. టిబెట్ను చైనాలో భాగంగా గుర్తించాలన్న వాషింగ్టన్ నిబద్ధతను ఉల్లంఘించినట్లుగా ఆరోపించింది. భారత్ పర్యటన సందర్భంగా ఆంటోనీ బ్లింకెన్ పౌర సమాజ సమూహాలతో బుధవారం భేటీ అయ్యారు. ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వమైన సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (సీటీఏ) ప్రతినిధి ఎన్గోడుప్ డాంగ్చుంగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దలైలామా తరుఫున కండువాను బ్లింకెన్కు అందజేశారు. ఢిల్లీలోని టిబెట్ హౌస్ డైరెక్టర్ గెషే డోర్జీ దమ్దుల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్తో డాంగ్చుంగ్ భేటీని 2016లో వాషింగ్టన్లో నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాతో దలైలామా సమావేశాన్ని గుర్తుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై మండిపడింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు. ‘14వ దలైలామా కేవలం మతపరమైన వ్యక్తే కాదు, చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలలో చాలా కాలంగా నిమగ్నం కావడంతోపాటు చైనా నుంచి టిబెట్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రవాస రాజకీయ నేత’ అని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో దలైలామా లేదా ఆయన ప్రతినిధులతో ఏ దేశమైనా సంప్రదింపులు జరుపడాన్ని చైనా తీవ్రంగా ఖండిస్తుందని జావో తెలిపారు. టిబెటన్ స్వాతంత్ర్యానికి లేదా చైనాను వేరు చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వవద్దని అమెరికాకు సూచించారు. తమ హక్కులు, ఆసక్తులను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చైనా తీసుకుంటుందని హెచ్చరించారు.