మాస్కో, జూన్ 19: అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వైదొలుగుతానని కొన్ని వారాల కిందటే ప్రకటించిన రష్యా.. తాజాగా చంద్రుడిపై పరిశోధన కేంద్రం నిర్మించేందుకు చైనాతో చేతులు కలిపింది. జాయింట్ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ సెంటర్ (ఐఎల్ఆర్ఎస్) పేరుతో దీనిని నిర్మించనున్నారు. ఇతర దేశాలతోనూ భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని ఆ రెండు దేశాలు యోచిస్తున్నాయి. వాస్తవానికి ఈ కేంద్రం ఏర్పాటుపై చైనా, రష్యా మధ్య గత మార్చిలోనే ఒప్పందం కుదిరింది. తాజాగా నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను ఇరుదేశాలూ ఆవిష్కరించాయి.
దక్షిణ ధ్రువంపై..
చంద్రుడిపైనా, కక్ష్యలోనూ పరిశోధన సదుపాయాలను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ప్రయోగాలు ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానున్నాయి. 2025లో పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. 2035నాటికి దీనిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ హెడ్ వూ యన్హువా మాట్లాడుతూ.. ‘ఐఎల్ఆర్ఎస్ నిర్మాణంలో అన్ని దశల్లో పాల్గొనేందుకు అంతర్జాతీయ భాగస్వాములకు చైనా, రష్యా స్వాగతం పలుకుతున్నాయి. మొదటి దశ ఈ ఏడాది ప్రారంభమవుతుంది. రెండో దశ కార్యక్రమాలు 2026-35 మధ్య కొనసాగుతాయి. చివరి దశ 2036లో మొదలవుతాయి’ అని వివరించారు. చంద్రుడిపై పరిశోధన కేంద్రం ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా నిర్ణయించకపోయినప్పటికీ, దక్షిణ ధ్రువంలోని అముండ్సెన్ బిలం వద్ద నిర్మించవచ్చని సమాచారం
చైనాపై రష్యా ప్రశంసలు
చంద్రుడిపై పట్టుసాధించేందుకు ఇప్పటికే ప్రపంచదేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. చైనా, రష్యా మిషన్తో ఆ పోటీ మరింత తీవ్రమైంది. ‘చైనా మంచి పురోగతి సాధిస్తున్నది. వారి అంతరిక్ష కార్యక్రమాలకు నిధులు సమృద్ధిగా కేటాయిస్తున్నారు. సాంకేతికంగా వారు గణనీయ అభివృద్ధి సాధించారు. తొలుత సోవియట్ సాంకేతికతలను వారు అనుసరించినా, ప్రస్తుతం వారు చాలా ముందుకు వెళ్లారు’ అని రష్యా రోస్కోస్మాస్ కార్పొరేషన్ సీఈవో ద్మిత్రీ రోగోజిన్ వ్యాఖ్యానించారు. చంద్రుడిపై పరిశోధనలకు చైనా, రష్యాలతో పాటు భారత్, అమెరికా కూడా పలు ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.