న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్ విభజన చట్టంపై ప్రశ్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జగడాలు ఉన్నట్లు మంత్రి చెబుతున్నారని, కానీ అలాంటి సమస్య ఉంటే చెప్పండి మేం పరిష్కరిస్తామన్నారు. మా మధ్య జగడాలు లేవు అని, సీఎం కేసీఆర్, సీఎం జగన్లు.. సమస్యలను పరిష్కరించేందుకు.. మీవద్దకు అనేక సార్లు వచ్చారన్నారు. పెండింగ్ అంశాలన్నీ కేంద్రం వద్దే ఉన్నాయన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని, ఇది ఆంధ్రాకు లింకులేని అంశమని ఎంపీ నామా డిమాండ్ చేశారు.
రాష్ట్ర పునర్ విభజనపై ఏపీ ఎంపీ రామ్ మోహన్ నాయుడు ప్రశ్న వేశారు. ఏపీ విభజన చట్టం అమలు తీరుపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన కోరారు. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు అయ్యాయో చెప్పాలన్నారు. బిల్లు పాసైనప్పుడు ఏపీకి స్పెషల్ స్టాటస్ ఇస్తామని మేజర్ హామీ ఇచ్చారని, దాని గురించి చెప్పాలంటూ ఎంపీ రామ్మోహన్ డిమాండ్ చేశారు.
హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. కేంద్రం వద్ద ఎటువంటి సమస్యలు పెండింగ్లో లేవన్నారు. ఏపీకి ప్యాకేజీ ఇచ్చామన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుఊ.. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, విభజన యాక్ట్ను కేవలం పదేళ్ల కోసం ఏర్పాటు చేశారని, కానీ విభజన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా.. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీకి స్పెషల్ క్యాటగిరీ స్టాటస్ ఇవ్వాలని ఎంపీ మిథున్ డిమాండ్ చేశారు.