మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 9: 70ఏండ్ల పాలనలో రాష్ట్రంలో నాలుగు మెడికల్ కళాశాలలు ఉండేవని, తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటి కళాశాల మహబూబ్నగర్కు తెచ్చుకున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పలు ఆభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని వైద్యవిద్యార్థులతో మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఈ మెడికల్ కళాశాల స్థలంలో గుట్ట ప్రాంతంగా ఉండేదని, సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో పాటు రూ. 450కోట్లతో కళాశాల భవనాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీ డాక్టర్ కల కోసం ఉచితంగా చదువుకొనేందుకు రూ.కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. ప్రజల డబ్బుతో చదువుతున్న మీరు.. ప్రజలకు సేవ చేయాలన్నారు.
టీఆర్ఎస్ కార్మిక విభాగం జెండా ఆవిష్కరణ
మెడికల్ కళాశాల ఏర్పడ్డాక వెయ్యి మందికి ఉపాధి దొరకడంతోపాటు ఉద్యోగాలు వచ్చాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని జెండా ఎగురవేశారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కార్మిక విభాగం సభ్యులను మంత్రి అభినందించి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, విఠల్రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదీప్రెడ్డి, గణేశ్, ఆశోక్గౌడ్, అధ్యక్షులు బాల్రాజ్, సురేశ్, రఫీయొద్దీన్, రమాదేవి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
నూతన చిత్రానికి క్లాప్ కొట్టినమంత్రి
ప్రముఖ హాస్యనటుడు గౌతమ్రాజు తనయుడు కృష్ణ హీరోగా, నవ్య హీరోయిన్గా నటిస్తున్న నూతన చిత్రానికి ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జేపీఎన్సీఈ కళాశాలలో ప్రారంభించి మాట్లాడారు. మంచి కథతో ప్రజలను ఆలోచింపజేయడంతోపాటు అందరినీ ఆకట్టుకునేలా సినిమా తీయాలని చిత్ర యూనిట్కు సూచించారు. అనంతరం మంఒత్రి మొక్క నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్, నటీనటులు తదితరులు ఉన్నారు.