తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆల్లు బువ్వ తినుర్రి..
ఫోన్పే, గూగుల్పేలో కట్నాలు పంపుర్రి..
కరోనా దృష్ట్యా వినూత్న రీతిలో పెండ్లి పత్రిక
నంగునూరు మండల యువకుడు వెరైటీ పెండ్లి పిలుపు
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 29 : పెండ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో మరుపురాని అనుభూతి. అయితే మనకు తెలిసిన చుట్టాలను, స్నేహితులను పెండ్లికి ఆహ్వానించడం సర్వ సాధారణం. కానీ, ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల పది మంది ఒక దగ్గర కలవలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంలో ఒక యువకుడు తన పెండ్లికి ఎవరూ రావద్దని, ఇంట్లోనే ఉండి ఆశీర్వదించాలని, కట్న కానుకలు ఆన్లైన్లో చెల్లించాలని వినూత్నంగా ఆహ్వానపత్రికను అచ్చు వేయించాడు. తెలంగాణ యాస, భాషను ప్రతిబింబించడంతో పాటు కరోనా భాషకు అనుగుణంగా పెండ్లి పత్రికను రూపొందించడంతో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన యూట్యూబర్, వ్లాగర్, సినీ నటుడు మై విలేజ్ షో ఫేం అనిల్ జీల పెండ్లి మే 1న జరుగనుండగా, అతను వెరైటీగా పెండ్లి పత్రిక అచ్చు వేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు.
శానిటైజర్ ఫస్ట్.. మాస్క్ మస్ట్.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్..
నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన యూట్యూబర్, వ్లాగర్, సినీ నటుడు మై విలేజ్ షో ఫేం అనిల్ జీల తన పెండ్లి కోసం వినూత్న రీతిలో శుభలేఖను ముద్రించడం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. ఈ శుభలేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు.. అని సాధారణంగా ప్రతి పెండ్లి పత్రికలో ఉంటుంది.. కానీ, దానికి భిన్నంగా ‘శానిటైజర్ ఫస్టు, మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్’.. అంటూ ఈ పెండ్లి పత్రిక ఉంది. పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు క్వాలిఫికేషన్కు బదులుగా కరోనా నెగిటివ్ అని వేశారు. మామూలుగా అయితే విందు వివాహానంతరం అని పత్రికల్లో చూస్తాం.. కానీ, ఇక్కడ ఎవరింట్ల వాళ్లే తల్వాలు పడ్డంక తినుర్రి అని ఉంది. బరాత్ ఎవరింట్ల వాళ్లే చేసుకొని మాకు 15 సెకన్ల వీడియో పెడితే దాన్ని తమ యూట్యూబ్ ఛానల్లో పెడుతామని పత్రికలో అచ్చు వేయించారు. ఈ పెండ్లి లైవ్ ద్వారా ప్రతి ఒక్కరూ చూడొచ్చని, పాపులర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ షో ఛానల్ టీమ్ ఈ లైవ్ను నిర్వహిస్తారని పెండ్లి పత్రికలో తెలిపారు. కట్న కానుకలు కూడా ఆన్లైన్లో పంపించేందుకు పెండ్లి పత్రికలో క్యూఆర్ కోడ్ను పొందుపరచారు. ఈ సందర్భంగా పెండ్లి కొడుకు అనిల్ జీల నమస్తే తెలంగాణతో మాట్లాడారు. తన పెండ్లికి వచ్చిన కట్న కానుకలను కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్న పేదవారికి అందజేస్తానని తెలిపారు.