జెనీవా: మనం ఇప్పుడు చేస్తున్న పనులే మన తర్వాతి జనరేషన్లకు వరాలుగానో, శాపాలుగానో మారుతాయి. కానీ ప్రస్తుతం ప్రపంచం పరిస్థితి చూస్తుంటే వరాలుగా మారే పనులేమీ చేయడం లేదు కానీ.. తర్వాతి తరాల బతుకుల దుర్భరం చేసే వైపు చాలా వేగంగా అడుగులు వేస్తున్నాం. ఈ మాట చెబుతున్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ ఐక్య రాజ్య సమితే. యునైటెడ్ నేషన్స్ ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) నివేదిక చాలా ఆందోళన కలిగించేలా ఉంది. రానున్న దశాబ్దాల్లో ఎలాంటి దారుణమైన పరిస్థితులను మనం, మన తర్వాతి తరాలు చూడబోతున్నామో ఈ రిపోర్ట్ కళ్లకు కట్టింది.
విధానాలు మార్చాల్సిందే..
ఐపీసీసీ ఏకంగా 4 వేల పేజీల నివేదికను తయారు చేసింది. వచ్చే ఏడాది అధికారికంగా ఇది రిలీజ్ కానుంది. అయితే ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీ ఈ ముసాయిదా నివేదిక వివరాలను వెల్లడించింది. రానున్న దశాబ్దాల్లో పర్యావరణంలో కలిగే మార్పుల వల్ల ఎంతటి తీవ్ర విపత్తులు సంభవించబోతున్నాయో తెలిపే నివేదిక ఇది. పౌష్టికాహార లోపం, అంటురోగాలు, తాగునీటి కొరత వంటివి సాధారణంగా మారిపోతాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుత విధానాల్లో మార్పులతో జరిగే నష్టాన్ని కాస్తయినా తగ్గించవచ్చని తేల్చి చెప్పింది.
మరో 8 కోట్ల మందికి ఆకలి ముప్పు
పంటల వైఫల్యం, కనీస ఆహార అవసరాలు తీర్చే వాటిలో పోషకాల లేమి వంటివి తప్పవని ఈ రిపోర్ట్ హెచ్చరించింది. ముఖ్యంగా 2021లో పుట్టిన పిల్లలు వారి 30వ ఏడాదిలో అడుగుపెట్టే సమయానికి అంటే 2050లో తీవ్రమైన పర్యావరణ మార్పుల వల్ల కలిగే ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదని ఈ రిపోర్ట్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఆ సమయానికి ఇప్పుడున్న వారికి అదనంగా మరో 8 కోట్ల మంది ఆకలి ముప్పును ఎదుర్కోవచ్చనీ చెప్పింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ముఖ్యమైన పంటల దిగుబడి తగ్గిపోతోంది. అంతేకాదు ఈ ఉష్ణోగ్రతలు వాటిలోని పోషకాల స్థాయిని కూడా తగ్గిస్తున్నాయి. రానున్న దశాబ్దాల్లో వరి, గోధుమ, బార్లీ, ఆలుగడ్డలు వంటి ముఖ్యమైన పంటల్లో ప్రొటీన్ స్థాయి 6-14 శాతం తగ్గనున్నట్లు ఐపీసీసీ రిపోర్ట్ తెలిపింది. దీనివల్ల మరో 15 కోట్ల మంది ప్రొటీన్ లోపంతో బాధపడే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేసింది. 2050 నాటికి ఆఫ్రికా, ఆసియాల్లోని మరో కోటి మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడనున్నట్లు చెప్పింది.
వ్యాధులతోనూ ముప్పే
ఇప్పటికే కరోనా వైరస్తో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. అయితే రానున్న దశాబ్దాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, తద్వారా దోమల సంఖ్య పెరగడం వల్ల ప్రపంచంలోని 50 శాతం జనాభా డెంగ్యూ, జికా వైరస్, యెల్లో ఫీవర్ వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది.