పలు రాష్ర్టాల్లో ఆంక్షల సడలింపు
న్యూఢిల్లీ, మే 31: కరోనా కేసులు తగ్గుతుండటంతో రాజస్థాన్లో జూన్ 2 నుంచి లాక్డౌన్ ఆంక్షలను సడలించడం ద్వారా ‘అన్లాక్’ ప్రక్రియ ప్రారంభం కానున్నది. కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆంక్షల నుంచి పలు కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని సోమవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బిహార్లో లాక్డౌన్ను జూన్ 8 వరకు పొడిగించినప్పటికీ పలు ఆంక్షలను సడలించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కర్ణాటకలో లాక్డౌన్ సడలింపుపై నిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్న అనంతరం జూన్ 4 లేదా 5వ తేదీల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం బీఎస్ యెడియూరప్ప తెలిపారు. ప్రస్తుతం జూన్ 7 వరకు అక్కడ లాక్డౌన్కు గడువు ఉంది. ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూను పొడిగించారు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ సోమవారంతో ముగియాల్సిన కర్ఫ్యూను మరో 10 రోజులు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్లో మరో ఆరు జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలను మంగళవారం నుంచి సడలిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మొత్తం 61 జిల్లాలకు ఆంక్షల నుంచి సడలింపు లభించినట్టు అవుతుంది.