తుక్కుగూడ, ఏప్రిల్ 29 : దేశంలో మరెక్కడా లేనివిధంగా రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ, పట్టుదల వల్లే సాధ్యమైందని వెల్లడించారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరాలలో రూ.2కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ను గురువారం మున్సిపల్ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్, డీఈ హన్మంత్రెడ్డి, ఏడీఈ వెంకటేశ్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారమైపోతుందన్న సమైఖ్య పాలకుల అంచనాలను పటాపంచలు చేస్తూ ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోతలు లేకుండా కరెంట్ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ పని తీరుకు నిదర్శనమన్నారు. గతంలో కరెంట్ ఎప్పుడూ పోతుండేదని, ఇప్పుడు కరెంట్ పోతే వార్త అన్న విధంగా రాష్ట్రంలో పరిస్థితులు మారాయని అన్నారు. నూతనంగా ప్రారంభించిన విద్యుత్ సబ్ స్టేషన్తో లోవోల్టేజీ సమస్య తీరడంతో పాటు పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగం గా మున్సిపల్ పట్టణ కేంద్రంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సుమారు రూ.కోటి యాబై లక్షలతో డీఈ కార్యాలయాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు ఈ సందర్భంగా సబ్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి నీరుపోశారు.
తుక్కుగూడ, ఏప్రిల్ 29 : ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకుంటే కరోనాను అరికట్టవచ్చని పేర్కొన్నారు. గురువారం తుక్కుగూడలో విలేకరులతో మాట్లాడారు. కొవిడ్ రోగుల కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ దవాఖానలలో అవసరమైన మేరకు బెడ్స్ కూడా ఏర్పా టు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో కొవిడ్ సెంటర్లను మరికొన్ని పెంచడంతో పాటు బెడ్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. చేవెళ్లలో 25, శేరిలింగంపల్లి కొండాపూర్ దవాఖానాలో 100, షాద్నగర్లో 50, మహేశ్వరంలో 25, జల్పల్లిలో 30 బెడ్లతో కరోనా చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.