పల్లెప్రగతితో మారిన రూపురేఖలు
ప్రతి ఇల్లూ నందనవనం కావాలి
జీపీల అభివృద్ధికి నెలనెలా నిధులు
గ్రామసభ ఆమోదంతోనే పనులు చేపట్టాలి
పంచాయతీ రాజ్ ప్రన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా
మహబూబాబాద్ రూరల్, జూలై 6 : పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయని పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మంగళవారం ఆయన జంగిలికొండ గ్రామంలో నర్సరీ, వైకుంఠధామం, రైతువేదిక, డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు. జంగిలికొండ క్రాస్ రోడ్ వద్ద జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, విలేజ్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా మంజూరైన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి మహేశ్కుమార్ గ్రామ ప్రగతి నివేదికను చదివి వినిపించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధించాలనే మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి గ్రామాల రూపురేఖలను మార్చిందన్నారు. ప్రతి ఇంట్లో విరివిగా మొక్కలు నాటి నందనవనంలా తీర్చిదిద్దుకోవాలన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నెలనెలా నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు, వాటితో గ్రామంలో చేసిన పనుల వివరాలను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో అంటించాలన్నారు.
రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించి, అభివృద్ధి పనులకు ఆమోదం తీసుకున్న తర్వాతే ప్రారంభించాలన్నారు. సర్పంచ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేసే అధికారాన్ని నూతన పంచాయతీరాజ్ చట్టం కలెక్టర్లకు ఇచ్చిందన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత పూర్తిగా పంచాయతీ కార్యదర్శులదేనన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలన్నారు. గ్రామంలో మొత్తం 16 రోడ్లు ఉండగా, రోజూ కేవలం మూడు రోడ్లను మాత్రమే శుభ్రం చేస్తున్నట్లు ప్రగతి నివేదికలో ఉందని, అది సరైన పద్ధతి కాదన్నారు. కొత్త చట్టం ప్రకారం గ్రామంలోని అన్ని వీధులను ప్రతిరోజూ శుభ్రం చేయించాలని ఎంపీవో హరి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మహేశ్కుమార్ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్నారు.
ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. పల్లెప్రగతితో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడి సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో భాగంగా రోడ్ల వెంబడి విరివిగా మొక్కలు నాటాలని, ఇంటికి ఆరు మొక్కల చొప్పు న పంపిణీ చేయాలన్నారు. అవసరమున్న రైతులకు టేకు మొక్కలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. గ్రామసభ అనంతరం ఎమ్మెల్యే శంకర్నాయక్, కలెక్టర్ గౌతమ్, సందీప్కుమార్ సుల్తానియా పల్లెప్రకృతి వనంలో మొ క్కలు నాటారు. సర్పంచ్ పంజాల యాకసాయిలు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్పంచ్లు బోడ లక్ష్మణ్నాయక్, వెంకన్న, ఎంపీటీసీ రామచంద్రమ్మ, అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్, ట్రైయినీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్డీవో పీడీ సన్యాసయ్య, డీపీవో రఘువరన్, తహసీల్దార్ రంజిత్కుమార్, ఎంపీడీవో రవీందర్, ఎం పీవో హరిప్రసాద్, సొసైటీ డైరెక్టర్ విజయాసుధాకర్, రైతుబంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ గోల్కొండ శ్రీను, నాయకులు అశోక్నాయక్, తేళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.