న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్రానికి పంపాలని తాము చేసిన విజ్ఞప్తిని మోడెర్నా తోసిపుచ్చిందని పంజాబ్ వెల్లడించిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం విదేశీ వ్యాక్సిన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వానికి నేరుగా వ్యాక్సిన్లను విక్రయించేందుకు ఫైజర్, మోడెర్నా కంపనీలు నిరాకరించాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతి విషయంలో భారత ప్రభుత్వంతోనే సంప్రదింపులు జరుపుతామని ఫైజర్, మోడెర్నాలు స్పష్టం చేశాయి.
కరోనా వ్యాక్సిన్లను కేంద్రమే దిగుమతి చేసుకుని వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేజ్రీవాల్ కోరారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ను తేలిగ్గా తీసుకోరాదని ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను తక్షణమే ఆమోదించాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్రాన్ని కోరారు. వ్యాక్సిన్ల కొరతతో 18 నుంచి 44 ఏండ్ల మధ్యవయస్కుల కోసం ఏర్పాటైన 400 వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేశామని చెప్పారు. 45 ఏండ్లు పైబడిన వారికి సైతం వ్యాక్సిన్ల కొరతతో పలు కేంద్రాలు మూతపడ్డాయని చెప్పారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1649 తాజా పాజిటివ్ కేసులు నమోదవగా 189 మంది మరణించారు.